నన్ను ఎన్‌కౌంటర్‌ చేయండి

‘కష్టాల్లో ఉన్నప్పుడు వైకాపాతో కలసి పని చేశాను. అనుమానం ఉన్నచోట ఉండకూడదని వెళ్లిపోదాం అనుకున్నాను. ఏ ఒక్కరినీ విమర్శించలేదు. చివరి వరకు పార్టీలో ఉండి ఆఖరి నిమిషంలో మరో జెండా పట్టుకునే మనస్తత్వం కాదు నాది.

Updated : 04 Feb 2023 06:47 IST

నా గొంతు ఆగాలంటే అదొక్కటే పరిష్కారం
ట్యాపింగ్‌ అబద్ధమైతే.. కేంద్రానికి లేఖ రాయండి
వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి ధ్వజం

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ‘కష్టాల్లో ఉన్నప్పుడు వైకాపాతో కలసి పని చేశాను. అనుమానం ఉన్నచోట ఉండకూడదని వెళ్లిపోదాం అనుకున్నాను. ఏ ఒక్కరినీ విమర్శించలేదు. చివరి వరకు పార్టీలో ఉండి ఆఖరి నిమిషంలో మరో జెండా పట్టుకునే మనస్తత్వం కాదు నాది. అధికార పార్టీకి దూరమవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాకు తెలుసు. 35 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో ఉన్నవాణ్ని. నా మనసు విరిగింది. ప్రాణంగా ఆరాధించిన జగన్‌ ప్రభుత్వంలో నా ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైంది. ఆధారాలు చూపించి బయటకు వచ్చా. ఆఖరి వరకు ఉండి మోసం చేయలేదు. నెల ముందు వరకు నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. ట్యాపింగ్‌పై ఆధారం దొరికాక దూరం జరిగా. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని జైల్లో పెడతారని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు లీకులిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తానంటే భయపడే రకం కాదు. నన్ను ఏ నిమిషంలో అయినా అరెస్టు చేసుకోండి. శాశ్వతంగా జైల్లో పెట్టండి. నా గొంతు ఆగే ప్రశ్నే లేదు. నా గొంతు ఆగాలంటే.. ఒక్కటే పరిష్కారం ఎన్‌కౌంటర్‌ చేయించండి’ అని వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం నెల్లూరులో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అందుకే.. ఆధారం బయటపెట్టా

‘10 మంది మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, సలహాదారులు నాపై ఎలా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. అందుకే నా వద్ద ఉన్న ఆధారం బయటపెట్టా. ట్యాపింగ్‌పై విచారణ జరపండని కోరా. రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర హోంశాఖకు లేఖ రాసి ఉంటే ప్రభుత్వ పారదర్శకత రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేది. ట్యాపింగ్‌ అనేది.. అధికారుల పని కాదు. ప్రభుత్వ పెద్దల పనే. అందుకే సమస్యను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పదేపదే అది ట్యాపింగ్‌ కాదని... కాల్‌ రికార్డింగ్‌ అని చెబుతున్నారు. నా చిన్ననాటి మిత్రుడితో ఆ మాట చెప్పిస్తారంట? ఇదేనా నిర్ధారణ అంటే’ అని శ్రీధర్‌రెడ్డి విమర్శించారు.

అనిల్‌ చేసింది నమ్మకద్రోహమంటే!

‘నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాటలు నన్నెంతగానో బాధించాయి. జగన్‌కు ఎవరైనా నమ్మకద్రోహం చేస్తే.. వారి పిల్లలు సర్వనాశనం అయిపోతారని అంటున్నారు. నా బిడ్డలు ఏం చేశారు? ఏదైనా ఉంటే నేరుగా నన్ను అనండి’ అని శ్రీధర్‌రెడ్డి అన్నారు. ‘నా కంటే చిన్నవాడైనా.. నా తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా.. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు అయిదేళ్లు అనిల్‌కుమార్‌ను నా భుజాలపై మోశాను’ అని తెలిపారు. అయినా నమ్మకద్రోహం అంటే తాను చేసింది కాదని, కార్పొరేటర్‌గా అవకాశమిచ్చిన ఆనం వివేకానందరెడ్డికి అనిల్‌ చేసిందే నమ్మక ద్రోహమని తీవ్ర విమర్శలు చేశారు. ‘ఎమ్మెల్యేగా గెలిచాక.. నీ ఇంటి మీదకు వస్తా అని బెదిరించింది నువ్వు కాదా?’ అని నిలదీశారు.

అమెరికా అధ్యక్షుడికే సలహాదారుగా ఉండాల్సినంత మేధావి సజ్జల

‘తప్పుడు ఆరోపణలతో సజ్జల రామకృష్ణారెడ్డి ఆడియోలు వదులుతున్నారు. నేను థియేటర్ల దగ్గర నుంచి నెలకు రూ.2 లక్షలు వసూలు చేస్తున్నట్లు చెబుతూ ఆడియోలు కొందరికి పంపిస్తున్నారు. ప్రభుత్వ తీరుతో ఉన్న థియేటర్లే మూతపడి కల్యాణ మండపాలుగా మారుతున్నాయ్‌. మీరు ఆడియోలు పెట్టాలనుకుంటే.. ఇసుక మాఫియా ఎవరు చేస్తున్నారు? మద్యంలో ఎవరికి ఎంత ముడుతుంది.. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో మంతనాలపై ఆడియోలు పెడితే బాగుంటుంది. ఇసుక నిర్వాహకుల దెబ్బకు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సైతం చేతులు కట్టుకోవాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్షుడికి సలహాదారుగా ఉండాల్సినంత మేధావి సజ్జల’ అని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్‌ అధికారంలోకి రావడానికి వేలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా సామాజిక మాధ్యమాల్లో పనిచేస్తే.. ప్రభుత్వ అధికారంలోకి రాగానే వైకాపా సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జిగా సజ్జల భార్గవ్‌రెడ్డిని ఎలా నియమించారు? అని ప్రశ్నించారు.

ఆ రోజే సస్పెండ్‌ చేయొచ్చు కదా?

‘డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ వేడుకల్లో క్షణం తీరకలేకుండా ఉన్నా. ఆ రోజు చంద్రబాబును కలిశానన్నది అబద్ధం. ఒకవేళ నిజమైతే అది తెలిసిన రోజే నన్ను సస్పెండ్‌ చేయొచ్చు కదా?’ అని శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. ఎవరు ఏ పార్టీ తరఫున ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని