రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం: వైఎస్‌ షర్మిల

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల కోసం జరిగిన అభివృద్ధి శూన్యమని.. ముఖ్యమంత్రి కుటుంబమే అభివృద్ధి చెందిందని  వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

Published : 04 Feb 2023 03:55 IST

పర్వతగిరి, న్యూస్‌టుడే: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల కోసం జరిగిన అభివృద్ధి శూన్యమని.. ముఖ్యమంత్రి కుటుంబమే అభివృద్ధి చెందిందని  వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. వరంగల్‌ జిల్లా నెక్కొండ, పర్వతగిరి మండలాల్లోని గ్రామాల్లో శుక్రవారం సాగిన పాదయాత్రలో ఆమె మాట్లాడారు. రైతుబంధు రూ.5 వేలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రుణమాఫీ చేయకుండా 16 లక్షల మంది రైతన్నలను డిఫాల్టర్లుగా మార్చారని మండిపడ్డారు. ఆయన పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. పర్వతగిరిలో షర్మిల మాట్లాడుతూ మంత్రి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌లపై పలు విమర్శలు చేశారు. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా దక్కనివ్వడం లేదన్నారు. అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచులకు ఏళ్ల తరబడి బిల్లులు రాకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. షర్మిల పాదయాత్ర సందర్భంగా తురుకల సోమారం గ్రామంలో సల్ప ఉద్రిక్తత నెలకొంది. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే రమేష్‌లపై చేసిన విమర్శలకు నిరసనగా షర్మిల ఫ్లెక్సీలను రమేష్‌ వర్గీయులు చించివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని