రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్‌ మాట్లాడటం విడ్డూరం

మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.

Published : 06 Feb 2023 03:27 IST

భారాస నాందేడ్‌ సభ విఫలం
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో ఉందనే వాస్తవాన్ని విస్మరించి మాట్లాడుతున్నారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారాస నిర్వహించిన సభ విఫలమైందన్నారు. 30 మంది తెరాస ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు 25 రోజులుగా నాందేడ్‌లో మకాం వేసి ఏర్పాట్లు చేసినా వెలవెలపోయిందని చెప్పారు. వేల సంఖ్యలో భారాస కండువాలు తీసుకెళ్లినా వేసుకునేవారు లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. సొంత ఊళ్లలో పది ఓట్లు కూడా రానివారే చేరారన్నారు. భారాస అధికారంలోకి వస్తే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్‌ ప్రకటించారని.. తెలంగాణలో మొదటి అయిదేళ్ల తెరాస పాలనలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరనే వాస్తవాన్ని మరచిపోయారా అని ప్రశ్నించారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన భారాస రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల్ని నిలువరించలేకపోయిందని.. సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోనూ చోటుచేసుకుంటున్నాయని గుర్తించాలని చెప్పారు. రాష్ట్రంలో సగటున రెండు రోజులకో రైతు ఆత్మహత్య చేసుకుంటుండగా.. దేశంలోనే బలవన్మరణాలు లేకుండా చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానన్న హామీని విస్మరించారన్నారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తానని చెబుతున్న సీఎం.. తెలంగాణలో సింగిల్‌ ఫేజ్‌ కరెంటే ఇస్తున్నారనే వాస్తవాన్ని దాచిపెడుతున్నారని విమర్శించారు. సాగునీటి అంశంలో దేశంగురించి తర్వాత మాట్లాడవచ్చని.. రాష్ట్రంలోని నదుల నుంచి వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంటే ఎంత మళ్లించారో చెప్పాలన్నారు. నిజాం షుగర్స్‌, రేయాన్‌ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేకపోయారని ప్రశ్నించారు. పెట్టుబడులను తీసుకురావడంలో మహారాష్ట్రతో తెలంగాణకు పోలికే లేదని, ఇప్పటికీ రాష్ట్రం నుంచి ఉద్యోగావకాశాలను వెతుక్కుంటూ ముంబయి వెళ్తున్నారని చెప్పారు. విదేశాలను పొగుడుతూ మన దేశాన్ని తిట్టడం సరికాదన్నారు. మోదీ పాలనలో దేశం ఆర్థికంగా 11వ స్థానంనుంచి అయిదో స్థానానికి చేరిందని గుర్తించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనే భారాసకు ఓటమి ఖాయమని సంజయ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని