ధైర్యముంటే నన్ను సస్పెండ్‌ చేయండి

‘శీనన్నతో కలసి ఉన్నారని వైరాలో కొంతమంది నా అభిమానులను స్థాయిలేని వారు భారాస నుంచి సస్పెండు చేస్తున్నట్లు ప్రకటించారు. ధైర్యం ఉంటే నన్ను సస్పెండు చేయండి’ అంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వరం పెంచారు.

Published : 07 Feb 2023 03:56 IST

మాజీ ఎంపీ పొంగులేటి
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పోటీలో తన అభిమానులుంటారని వెల్లడి

అశ్వారావుపేట, దమ్మపేట, న్యూస్‌టుడే: ‘శీనన్నతో కలసి ఉన్నారని వైరాలో కొంతమంది నా అభిమానులను స్థాయిలేని వారు భారాస నుంచి సస్పెండు చేస్తున్నట్లు ప్రకటించారు. ధైర్యం ఉంటే నన్ను సస్పెండు చేయండి’ అంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వరం పెంచారు. ముఖ్యమంత్రులు అంటే ‘ప్రజల గుండెల్లో నిలిచిన, కిలో బియ్యం రూపాయికే ఇచ్చి పేదల ఆకలి తీర్చిన ఎన్టీఆర్‌, గ్రామగ్రామాన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి’ అని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో సోమవారం మధ్యాహ్నం జారే ఆదినారాయణ అధ్యక్షతన పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం సాగింది. నియోజకవర్గం నుంచి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. రెండు పడకగదుల ఇళ్లు అంటూ ఎక్కడో ఒకచోట 20 ఇళ్లు నిర్మించి వాటినే పేపర్లో పెద్దపెద్ద ఫొటోలతో రాష్ట్రం మొత్తం ఇలాగే ఉందని చూపిస్తున్నారని విమర్శించారు. పోడు సాగుదారులకు హక్కు పత్రాలు లేవు. నిరుపేద సర్పంచులు అనేకమంది చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాక, సొంత ఆస్తులు తాకట్టు పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో తన అభిమానులు అభ్యర్థులుగా నిలుస్తారని పొంగులేటి పేర్కొన్నారు. అశ్వారావుపేట అభ్యర్థిగా జారే ఆదినారాయణను సభాముఖంగా ప్రకటించారు. సమావేశంలో జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ మువ్వా విజయబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని