గుడివాడ, మచిలీపట్నం డీఎస్పీలను సస్పెండ్‌ చేయాలి

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెదేపా నేత రావి వెంకటేశ్వరరావు విషయంలో చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన గుడివాడ, మచిలీపట్నం డీఎస్పీలను తక్షణమే సస్పెండ్‌ చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండు చేశారు.

Published : 08 Feb 2023 05:04 IST

తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు  వర్ల రామయ్య డిమాండ్‌

ఈనాడు-అమరావతి: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెదేపా నేత రావి వెంకటేశ్వరరావు విషయంలో చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన గుడివాడ, మచిలీపట్నం డీఎస్పీలను తక్షణమే సస్పెండ్‌ చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండు చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు చెప్పిందే పోలీసులకు చట్టమా? అని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ‘మాజీ మంత్రి పేర్ని నాని తన పలుకుబడితో మచిలీపట్నంలోని 5.35 ఎకరాల దేవాదాయ భూమిని పీడబ్ల్యూడీ పోరంబోకుగా మార్చేశారు. ఆ భూమి తమకిస్తే భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి స్మృతివనం నిర్మిస్తామని ఎంపీ బాలశౌరి కోరగా.. దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సీఎం కూడా సిఫారసు లేఖ ఇచ్చారు. అయినా పేర్ని నాని ఆ భూమిని వైకాపా కార్యాలయ నిర్మాణానికి ఇవ్వాలని పట్టుబట్టి కింది స్థాయి అధికారుల ద్వారా నిరభ్యంతర ధ్రువీకరణ పొందారు. వైకాపా కార్యాలయ నిర్మాణానికి ఇస్తున్నట్లు పత్రాలు సృష్టించారు...’ అని వివరించారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకున్నందుకే మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తప్పుడు కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. గుడివాడ ఎమ్మెల్యే ఆదేశాలతోనే రావి వెంకటేశ్వరరావును అరెస్టు చేసి అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్లకు తిప్పి వేధించారని, అధికారులను అడ్డుకున్నారంటూ తప్పుడు కేసులు పెట్టారని వర్ల రామయ్య దుయ్యబట్టారు. ఏ చట్ట ప్రకారం వెంకటేశ్వరరావు, పామర్రు తెదేపా ఇన్‌ఛార్జి వర్ల కుమార్‌ రాజాను పోలీస్‌స్టేషన్లో ఉంచారో సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. తప్పుడు కేసులతో తెదేపా నేతలను అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొంటూ డీజీపీకి వర్ల లేఖ రాశారు. గుడివాడ, మచిలీపట్నం డీఎస్పీల ప్రవర్తన డీజీపీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ‘ఇద్దరు డీఎస్పీలపై ప్రైవేటు కేసులు వేస్తాం. పలమనేరు డీఎస్పీ కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరించారు. పదవీ విరమణ చేసిన విజయపాల్‌ అనే అధికారినీ వదలం. ఆయనేం చేశారనే వివరాలూ సేకరించాం. ఇలాంటి వారంతా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు. తప్పుడు కేసులు, పోలీసుల మితిమీరిన ప్రవర్తనపై కమిషన్‌ వేస్తాం...’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.

కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సైల వరకు నిరాశ, నిస్పృహల్లోనే

కానిస్టేబుల్‌ తన్నీరు వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రిని తీవ్రంగా ఎందుకు దుర్భాషలాడాల్సి వచ్చిందో, ఆయన నిరాశా నిస్పృహల వెనక కారణమేమిటో డీజీపీ రాజేంద్రనాథరెడ్డి గుర్తించాలని వర్ల రామయ్య కోరారు. ‘రాష్ట్రంలో కానిస్టేబుల్‌, ఏఎస్సై స్థాయి పోలీసులు తీవ్రమైన నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అదనపు సరెండర్‌ లీవులు, ఎన్‌క్యాష్‌మెంట్‌ లీవులు, జీపీఎఫ్‌పై డీజీపీ ఎప్పుడైనా ప్రభుత్వంతో మాట్లాడారా? అని వర్ల ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని