నిధులు రావని తెలిసీ భారీ బడ్జెట్టా?

రాష్ట్ర ఆవిర్భావం నుంచి గత బడ్జెట్‌ వరకు ప్రతిపాదించిన మొత్తంలో 70-80 శాతానికి మించి ఖర్చు ఉండటం లేదని.. అయినా ఈసారీ అదే తప్పు చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

Updated : 09 Feb 2023 05:44 IST

అన్యాయం చేస్తోందని కేంద్రాన్ని నిందించడం తప్పు: ఈటల రాజేందర్‌

ఈనాడు, హైదరాబాద్‌, గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ఆవిర్భావం నుంచి గత బడ్జెట్‌ వరకు ప్రతిపాదించిన మొత్తంలో 70-80 శాతానికి మించి ఖర్చు ఉండటం లేదని.. అయినా ఈసారీ అదే తప్పు చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. 2021-22లో రూ.2.21 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఖర్చు చేసింది రూ.1.75 లక్షల కోట్లు మాత్రమేనన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాలకు సంబంధించి ఒకే విధానం ఉంటుందని.. అయినా రాష్ట్రానికి భాజపా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. శాసనసభలో బుధవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘భూముల విక్రయంతో రూ.16 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. గతేడాది అది రూ.3 వేల కోట్లకు మించలేదు. స్పెషల్‌ అసిస్టెన్స్‌ అని రూ.25 వేల కోట్లు చూపుతున్నారు. నిరుడు ఒక్కపైసా రాలేదు. మొత్తమ్మీద తాజా బడ్జెట్‌లో పేర్కొన్న రూ.55 వేల కోట్ల నిధుల్లో ఒక్కపైసా రాదు. మరి రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్‌ ఎందుకు?  

దళితబంధు ఖర్చు రూ.4,440 కోట్లేనా?

దళితులందరికీ దళితబంధు పథకం అందాలంటే రూ.2 లక్షల కోట్లు కావాలని ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు. గత బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించి.. చివరకు రూ.4,440 కోట్లే ఖర్చు చేశారు. ఈ బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు చూపారు. ఇప్పటికీ చాలామందికి మొదటి వాయిదా మాత్రమే అందింది. 2018 ఎన్నికల సందర్భంగా పంట రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికీ 35 లక్షల మంది ఎదురుచూస్తున్నారు’’ అని ఈటల అన్నారు.

అల్పాహారం తినేందుకూ గది లేదు..

శాసనసభలో భాజపాకు గది కేటాయించకపోవడంపై  ఈటల రాజేందర్‌, మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది.  బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. అసెంబ్లీలో తమకు అల్పాహారం తినేందుకు కూడా గది లేదని అన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలం ఎక్కడ కూర్చొని మాట్లాడుకోవాలని ప్రశ్నించారు.  దీనిపై మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. కనీసం అయిదుగురు సభ్యులు ఉంటేనే గది కేటాయించాలన్న సంప్రదాయం ఉందని చెప్పారు. బడ్జెట్‌పై సూచనలు ఇచ్చే బదులు గది గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు. మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌ జోక్యం చేసుకుంటూ.. ఈ విషయమై స్పీకర్‌ను కలిసి విన్నవించాలని, వాగ్వాదం ఎందుకని ప్రశ్నించారు.  సభాపతిని ఆరుసార్లు కలిసినా ప్రయోజనం లేదని రాజేందర్‌ పేర్కొన్నారు.

రైతులకు  రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదో సమాధానం చెప్పి, ముక్కు నేలకు రాయాలని సీఎం కేసీఆర్‌ను  ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ‘‘విశ్వవిద్యాలయాలను సాంఘిక సంక్షేమ వసతిగృహాల కంటే దారుణంగా మార్చేశారు. ఇది తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా. కాళేశ్వరం ప్రాజెక్టును కూడా చూడనివ్వకుండా అడ్డుకుంటున్నారు’’ అని అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని