బడ్జెట్‌లోని అంకెలన్నీ అనుమానాస్పదమే

‘‘ప్రభుత్వానికి ఉద్దేశాలు ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. అవి ప్రజలకు చేరాలి. రాష్ట్రంలో అందరి తలసరి ఆదాయం పెంచలేకపోగా అప్పులు మాత్రం భారీగా పెంచారు.

Updated : 09 Feb 2023 05:44 IST

పంట రుణాల మాఫీకి నాలుగో  వంతూ కేటాయించలేదు..
అదానీ అక్రమాలకు భాజపా వక్రభాష్యాలు: భట్టి విక్రమార్క

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ప్రభుత్వానికి ఉద్దేశాలు ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. అవి ప్రజలకు చేరాలి. రాష్ట్రంలో అందరి తలసరి ఆదాయం పెంచలేకపోగా అప్పులు మాత్రం భారీగా పెంచారు. ఇప్పటివరకు రుణాలు రూ.4.86 లక్షల కోట్లకు చేరాయి. ఈ భారమంతా ఎవరు మోయాలి’’ అని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ గతంలో ఎప్పుడూ రూ.8-10 వేల కోట్లు దాటలేదు. కానీ, రూ.41 వేల కోట్లు వస్తుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. అంత మొత్తం రాదని తెలిసీ దాదాపు రూ.3 లక్షల కోట్లకు బడ్జెట్‌ ఎందుకు పెంచారన్నది వారికే తెలియాలి. అంకెలన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయి. ఓ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని కొన్ని కుటుంబాల ఆదాయం మాత్రమే రూ.వేల కోట్లు పెరిగింది. ఆ సంపన్నుల్లోని ఓ వ్యక్తి ఇంటి విస్తీర్ణం 2లక్షల చదరపు అడుగుల్లో ఉంది. సామాన్యులు ఇప్పటికీ ఇంటి కోసమో, స్థలం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఎసైన్డ్‌ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుని హెచ్‌ఎండీఏ ద్వారా వేలం వేయటం సరికాదు. ఒక్క ఇబ్రహీంపట్నంలో పేదలకు ఇచ్చిన ఏడెనిమిది వేల ఎకరాలను ప్రభుత్వం వెనక్కు తీసుకోవటం అన్యాయం’’ అని భట్టి పేర్కొన్నారు.

గొంతెత్తితే కేంద్రం దాడులు చేయిస్తోంది

‘‘కేంద్రం కూడా బడ్జెట్‌ అంకెలను భారీగా రూ.45 లక్షల కోట్లుగా చూపింది. కొత్త రాష్ట్రాన్ని ఆదుకోవాల్సి ఉండగా.. గుండుసున్నా ఇచ్చింది. గొంతెత్తితే ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తోంది. రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేపట్టి.. అదానీ అక్రమాలను ప్రజలకు వివరిస్తే భాజపా వక్రభాష్యాలు చెబుతోంది. (ఈ సందర్భంగా ‘రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడండి’ అంటూ భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు పెద్దగా పలు దఫాలు కేకలు వేశారు) ‘ప్రపంచం బాధంతా శ్రీశ్రీ బాధైతే... కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ’ అన్నట్లుగా అదానీ అక్రమాలపై మాట్లాడితే భాజపా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విమానాశ్రయాలు అయిపోయాయి.. ఇప్పుడు వ్యవసాయాన్ని కార్పొరేట్‌ సంస్థలకు కేంద్రం అప్పగిస్తోంది.

సంగమేశ్వరం వద్ద నీటి తరలింపుతో నష్టం

రాయలసీయ లిఫ్ట్‌ ఇరిగేషన్‌లో భాగంగా సంగమేశ్వరం వద్ద 10 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. అదే జరిగితే శ్రీశైలానికి, నాగార్జునసాగర్‌కు, ఎన్‌ఎస్‌పీ ఎడమ కాలువకూ నీళ్లందవు. ఖమ్మం జిల్లాలోని పాలేరు, సత్తుపల్లి, మధిర తదితర నియోజకవర్గాలు ఎడారిగా మారిపోతాయి. కాళేశ్వరం అతిపెద్ద ప్రాజెక్టు అని చెప్పుకొంటున్నా.. మేడిగడ్డ నుంచి ఎన్ని టీఎంసీలు ఎత్తిపోశారు? ఖర్చు ఎంతో చెప్పాలి. పంట రుణాల మాఫీకి రూ.20 వేల కోట్లు అవసరం కాగా.. బడ్జెట్‌లో నాలుగో వంతు కూడా కేటాయించలేదు. మొత్తానికి బడ్జెట్‌ వాస్తవానికి, లక్ష్యాలకు దూరంగా ఉంది’’ అని భట్టివిక్రమార్క అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని