త్రిపుర పీఠంపై వీడని ఉత్కంఠ

త్రిపురలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేది ఎవరన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Published : 06 Mar 2023 03:37 IST

మాణిక్‌ సాహా వైపు భాజపా అధిష్ఠానం మొగ్గు
పోటీలో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్‌

అగర్తలా: త్రిపురలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేది ఎవరన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో స్థానిక పార్టీలో విభేదాలు తలెత్తకుండా, ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన భాజపా కీలక నేత హిమంత బిశ్వ శర్మ ఇప్పటికే అక్కడికి చేరుకొని మంతనాలు సాగిస్తున్నారు. 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో భాజపా 32 సీట్లు కైవసం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాల్లో ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి మాణిక్‌ సాహా పట్ల ఒక వర్గం సానుకూలత వ్యక్తం చేస్తుండగా, మాజీ సీఎం విప్లవ్‌ దేవ్‌ మద్దతుదారులున్న మరో వర్గం కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్‌ను పదవి వరిస్తుందని నమ్ముతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజా ఎన్నికల్లో భౌమిక్‌ ధన్‌పుర్‌ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. దేబ్‌ స్థానంలో సాహా గతేడాది మార్చి 14న త్రిపుర సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో మంత్రి రామ్‌ప్రసాద్‌ పాల్‌ నేతృత్వంలో పలువురు పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అయితే భౌమిక్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని రాజకీయ విశ్లేషకుడు, సీనియర్‌ పాత్రికేయుడు శేఖర్‌ దత్తా అభిప్రాయపడ్డారు. మరోవైపు సీఎం అభ్యర్థిపై మరింత స్పష్టత సాధించే దిశగా కొత్తగా ఎన్నికైన భాజపా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదని పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. భాజపా కేంద్ర నాయకత్వం సాహా పట్ల సానుకూలంగా ఉందని.. ఎందుకంటే ఆయన వివాద రహితుడని, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వ్యతిరేకతను చల్లార్చేందుకు ఆయన అవసరం ఉందని అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ఖరారు చేసేందుకు త్వరలో పార్టీ నాయకులు సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు నడ్డా తదితరులు హాజరుకానున్నారు.

* టిప్రాసా ప్రజల సమస్యలకు రాజ్యాంగ పరిష్కారం సాధించడానికి భాజపాతో సమావేశానికి సిద్ధంగా ఉన్నట్లు టిప్రా మోథా ప్రకటించింది.


అమిత్‌ షాతో బిశ్వశర్మ భేటీ

దిల్లీ: త్రిపుర, నాగాలాండ్‌లలో ప్రభుత్వ ఏర్పాటు విషయమై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని