2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయాలి

రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న రెండు లక్షల వరకు ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. ‘ఏటా జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు.

Published : 18 Mar 2023 05:42 IST

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న రెండు లక్షల వరకు ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. ‘ఏటా జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఒక్కసారి మాత్రమే 10 వేల పోస్టులతో క్యాలెండర్‌ ప్రకటించారు. 2004 సెప్టెంబరు కంటే ముందు ఉద్యోగాలకు ఎంపికై.. ఆ తర్వాత నియామకం పొందిన వారికి కేంద్రం పాత పింఛను విధానాన్ని వర్తింపజేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

* రాష్ట్రంలో వివిధ అంశాలపై పీడీఎఫ్‌, వైకాపాకు చెందిన ఎమెల్సీలు, ఎమ్మెల్యేలు తమ గళాన్ని వినిపించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వారు మాట్లాడారు.

తప్పుడు సమాచారమిస్తున్నారు

‘మండలిలో ప్రశ్నలు అడిగితే రికార్డుల్లో దొరక్కుండా ఉండేలా మంత్రులు అంతా బాగున్నట్లు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. కోనసీమ జిల్లాలో కొన్ని వేల టన్నుల ధాన్యం కళ్లాల్లో ఉంటే లక్ష్యం పూర్తయిందని.. ఇక కొనుగోలు చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది. రైతు అండగా ఉండడమంటే ఇదేనా? పోలీసులకు టీఏలు, ఈఎల్స్‌ బకాయిలు చెల్లించడం లేదు. వారాంతపు సెలవు అమలు కావడం లేదు.’

ఐ.వెంకటేశ్వరరావు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ

పులివెందుల ఒక్కటే ప్రత్యేకమా?

‘పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలోని వైఎస్‌ రాజారెడ్డి జూనియర్‌ కళాశాలలో పనిచేసే అన్‌ఎయిడెడ్‌ అధ్యాపకుల్ని కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకుని రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోని వారిని పొరుగు సేవల కింద తీసుకోవడం ఏంటి? రాష్ట్రంలోని అన్‌ఎయిడెడ్‌ అధ్యాపకుల్ని అందరినీ కాంట్రాక్ట్‌ విధానంలోకి తీసుకుని మినిమమ్‌ టైం స్కేల్‌ను వర్తింప చేయాలి. ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల్ని ఎప్పడు భర్తీ చేస్తారని అడిగితే ప్రభుత్వం సరిగా సమాధానమివ్వడం లేదు.’

షేక్‌ సాబ్జీ, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ

జగన్‌ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు

‘ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్‌ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దళారుల బెడద లేకుండా 22 పథకాల సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. పేదలకు పథకాలు అందుతున్న తీరు చూసి వైకాపా ఎమ్మెల్యేగా కంటే పౌరునిగా ఎక్కువ సంతోషపడుతున్నా. ముఖ్యమంత్రిగా జగన్‌ కొనసాగాల్సిన అవసరముంది.’

వరప్రసాద్‌, వైకాపా ఎమ్మెల్యే

ప్రగతి శీల బడ్జెట్‌

’2023-24 బడ్జెట్‌ ప్రగతి శీల బడ్జెట్‌. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంది. మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి రూ.77 వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడం దుర్మార్గం. వారు ప్రజా ప్రయోజనాల్ని పట్టించుకోకుండా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు.’

పోతుల సునీత, వైకాపా ఎమ్మెల్సీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని