ఉత్తరాంధ్ర ప్రజలు వైకాపాను తిప్పికొట్టారు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేల అహంకారానికి చెంపపెట్టు అని జైభీం భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

Published : 18 Mar 2023 05:42 IST

పట్టభద్రుల నిర్ణయం అందరికీ కనువిప్పు
2024 ఎన్నికల్లో ఇదే తీర్పు పునరావృతం
రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చిన సీఎం జగన్‌
దళితులను చంపుతూ.. భారీ అంబేడ్కర్‌ విగ్రహాలెందుకు?  
జైభీం భారత్‌ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేల అహంకారానికి చెంపపెట్టు అని జైభీం భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ అన్నారు. విజయవాడలోని జైభీం భారత్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రజలు వైకాపా ఎత్తులను తిప్పికొట్టారని వారు తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ కనువిప్పు లాంటిదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్నామని పేర్కొన్నారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఇదే తీర్పు పునరావృతం కానుందని చెప్పారు.  రాష్ట్రాన్ని గత నాలుగేళ్లలో జగన్‌ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చారని శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు. ‘అన్నివర్గాల ప్రజల బతుకుల మీదా దెబ్బ కొట్టారు. జగన్‌ ప్రభుత్వం త్వరలో కనుమరుగవడం ఖాయం. అమరావతిని రాజధానిగా చంపేసి విశాఖను ప్రకటించారు. పారిశ్రామిక సదస్సు పేరుతో అక్కడ హడావుడి చేశారు. అయితే తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు వైకాపాను తిరస్కరించారు. భూకబ్జాలు, ఫ్యాక్షన్‌ పాలన మాకొద్దంటూ విశాఖ ప్రజలు తేల్చి చెప్పారు. ఇక ఏ ముఖం పెట్టుకుని విశాఖకు వెళ్తారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకు కనీసం ఇప్పటికైనా సిగ్గుపడాలి.’ అని శ్రావణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుతో ఓట్లను కొనేయొచ్చని విర్రవీగుతున్న వైకాపా నేతలకు ప్రజలు బాగా బుద్ధి చెప్పారన్నారు.

యువతను ఇంతలా ఎవరూ మోసం చేయలేదు..

రాష్ట్రంలో యువత, నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్‌ మాదిరిగా మోసం చేసినవాళ్లు గతంలో ఇంకెవరూ లేరని శ్రావణ్‌కుమార్‌ అన్నారు. ఒకటో తేదీన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ‘జాబ్‌ క్యాలెండర్‌ అంటే అసలు అర్థం తెలుసా, చదువుకుని వచ్చారా? చదువు కొని వచ్చారా?, అసలు మీరు డిగ్రీ చదివారా? మిమ్మల్ని చూస్తుంటే ఫేక్‌ డిగ్రీలతో చదువుకుని వచ్చినట్టు అనిపిస్తోంది’ అని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగుల పొట్ట కొట్టారని, కాంట్రాక్టు ఉద్యోగులు వేల మందిని రోడ్డున పడేశారని అన్నారు. ‘రాష్ట్రంలో గత నాలుగేళ్లలో కనీసం పదివేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. ఒక మెగా డీఎస్సీ లేదు, వేలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారంలోకి వచ్చాక వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారు. వీటన్నింటికీ తగిన మూల్యం వచ్చే ఎన్నికల్లో చెల్లించక తప్పదు.’ అని శ్రావణ్‌కుమార్‌ హెచ్చరించారు. సాధారణ ఎన్నికల్లో వైకాపాను బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమన్నారు.

ఎంపీ అవినాష్‌రెడ్డిని దిల్లీకి తీసుకెళ్లి అందరినీ ఎందుకు కలుస్తున్నారో చెప్పాలన్నారు. అవినాష్‌రెడ్డి కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అతనికి చెంపపెట్టు లాంటిదని అభిప్రాయపడ్డారు. దళిత బిడ్డను చంపిన అనంతబాబుకు వైకాపా నేతలు స్వాగతం పలుకుతూ, శాసన మండలిలో అతనితో మాట్లాడిస్తూ ఏం సంకేతాలిస్తున్నారు. ఒకవైపు దళితులను చంపుతున్నారు. మరోవైపు భారీగా అంబేడ్కర్‌ విగ్రహం అంటూ నీతులు చెబుతున్నారు’ అని శ్రావణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని