ఓర్వలేకే విమర్శలు

భారత ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థల విజయం కొంతమందికి బాధ కలిగిస్తోందనీ, అందుకే వాటిపై వారు దాడులకు దిగుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు.

Published : 19 Mar 2023 03:38 IST

భారత ప్రజాస్వామ్యంపై ప్రపంచం ఆశాభావంతో ఉంది
కొందరు మాత్రం బురద జల్లేలా మాట్లాడుతున్నారు
రాహుల్‌పై మోదీ పరోక్ష విమర్శనాస్త్రాలు

దిల్లీ: భారత ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థల విజయం కొంతమందికి బాధ కలిగిస్తోందనీ, అందుకే వాటిపై వారు దాడులకు దిగుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. శనివారం ‘ఇండియా టుడే’ నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశ ప్రజాస్వామ్య పరిస్థితిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన విమర్శలను పరోక్షంగా గుర్తుచేస్తూ మోదీ మాట్లాడారు. ‘‘భారత్‌ పట్ల ప్రపంచ మేధావులు ఆశాభావంతో ఉన్నారు. దేశ ప్రజలూ దీనిపై పూర్తి విశ్వాసంతో, కట్టుబాటుతో ఉన్నారు. అదే సమయంలో దేశంపై బురదజల్లే రీతిలో, స్థైర్యాన్ని దెబ్బతీసే తీరులో, నైరాశ్యంతో కొందరు మాట్లాడుతున్నారు. ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు నల్లని దిష్టిచుక్క పెట్టడం ఆచారం. అలాగే అనేక పవిత్ర కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నప్పుడు ఇలా దిష్టిచుక్క పెట్టే బాధ్యతను కొందరు తీసుకున్నారు’’ అని ఆయన చెప్పారు.

భిన్నమైన పనితీరుతో సరికొత్త ఫలితాలు

ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదన్న విషయాన్ని ప్రపంచానికి మన దేశం చాటిచెప్పిందని మోదీ అన్నారు. ఈ విజయాన్ని కొందరు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. ఎన్ని దాడులు జరిగినా దేశం మాత్రం తన లక్ష్యాలను సాధించడంలో మున్ముందుకే వెళ్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రసార మాధ్యమాలు కూడా కీలక భూమిక పోషించాలన్నారు. ‘‘కుంభకోణాల గురించి గతంలో పత్రికల్లో పతాక శీర్షికలు కనిపించేవి. ఇప్పుడు మాత్రం- తమపై చర్యలు తీసుకుంటున్నందుకు అవినీతిపరులు చేతులు కలపడం ప్రధాన వార్తాంశం అవుతోంది. అప్పట్లో స్కాంలు గురించి చూపించి.. ఛానళ్లు తమ టీవీ రేటింగ్‌ పాయింట్స్‌ (టీఆర్‌పీ) పెంచుకునేవి. ఇప్పుడు అవినీతిపరులపై చర్యల గురించి చూపించడం ద్వారా టీఆర్‌పీ పెంచుకునే అవకాశం వచ్చింది. సంతులన చర్య పేరుతో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగవద్దు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు’’ అని ఆయన సరదాగా చెప్పారు. ‘‘ఇప్పుడు భారతదేశానికి తగిన సమయం వచ్చిందని ప్రపంచం చెబుతోంది. దేశ పనితీరులో మార్పు రావడమే దీనికి కారణం. తమతమ సామర్థ్యాల ప్రకారం ప్రభుత్వాలన్నీ పనిచేసి తదనుగుణమైన ఫలితాలు పొందితే మా ప్రభుత్వం మాత్రం సరికొత్త ఫలితాలను కోరుకుని.. భిన్నమైన విధానంలో పనిచేస్తోంది. గతంలోనూ సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నా మా ప్రభుత్వం వాటిలో సమర్థతను, వేగాన్ని, పరిమాణాన్ని పెంచింది. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్న మన దేశం.. స్మార్ట్‌ఫోన్‌ డేటా వాడుకదారుల్లో తొలిస్థానంలో, మొబైల్‌ ఫోన్ల తయారీలో రెండోస్థానంలో నిలుస్తోంది’’ అని చెప్పారు. వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని