అడవిపై హక్కు గిరిజనులదే

రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలుగా ఉన్న జిల్లాల్లోని అడవులపై హక్కులన్నీ గిరిజనులకే ఉంటుందని.. అటవీ ప్రాంతాల్లో చెట్టు, పుట్ట, పండ్లు, నీళ్లపై సర్వహక్కులు గిరిజనులకు చెందాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.

Published : 20 Mar 2023 04:27 IST

మిషన్‌ భగీరథ పెద్ద కుంభకోణం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజం

ఈటీవీ- ఆదిలాబాద్‌; ఇంద్రవెల్లి, ఉట్నూరు గ్రామీణం- న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలుగా ఉన్న జిల్లాల్లోని అడవులపై హక్కులన్నీ గిరిజనులకే ఉంటుందని.. అటవీ ప్రాంతాల్లో చెట్టు, పుట్ట, పండ్లు, నీళ్లపై సర్వహక్కులు గిరిజనులకు చెందాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదంతో నిజాంకు వ్యతిరేకంగా కుమురం భీం, మన్యం ప్రజల హక్కుల కోసం అల్లూరి సీతారామరాజు పోరాటం చేసి సాధించుకున్న అటవీహక్కులను గిరిజనులకు దక్కేలా ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చట్టం చేస్తే, ఇప్పుడున్న ప్రభుత్వాలు వాటిని నీరుగార్చి నిధులు కొల్లగొడుతున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొనసాగుతున్న భట్టి పాదయాత్ర ఆదివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఇంద్రవెల్లి నుంచి ప్రారంభమైన యాత్ర ఈశ్వర్‌నగర్‌, పులిమడుగు, కుమ్మరితండా, ఎందా క్రాస్‌ రోడ్డు, శ్యాంపూర్‌, ఉట్నూర్‌ క్రాస్‌ రోడ్డు మీదుగా లాల్‌టేకిడి వరకు కొనసాగింది. కుండల తయారీకి అవసరమైన మట్టిని అడవి నుంచి తెచ్చుకునేవారమని.. కానీ ఇప్పుడు అటవీ అధికారులు కంచె నిర్మించి.. తమను వెళ్లనివ్వడంలేదని కుమ్మరితండాకు చెందిన రుక్మిణిబాయి తదితరులు భట్టి వద్ద వాపోవడంతో ఆయన వారిని ఓదార్చారు. అనంతరం ఆదివారం రాత్రి ఉట్నూరులో సభ నిర్వహించారు. అంతకుముందు ఎందా క్రాస్‌రోడ్డు సమీపంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తొమ్మిదేళ్ల కేసీఆర్‌ పాలనలో ఐటీడీఏలను నిర్వీర్యం చేయడం ద్వారా ఏజెన్సీలోని ఆదివాసీలు, గిరిజనులు, గిరిజనేతరుల బతుకులు దుర్భరంగా మారాయని అన్నారు. రాష్ట్రంలో రూ.42 వేల కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం ఓ పెద్ద కుంభకోణమని, ఏ ఒక్క గిరిజన ప్రాంతానికీ ఆ నీళ్లు రాకపోయినా.. డబ్బులన్నీ దండుకున్నారని ఆరోపించారు. పైసలిస్తే కానీ ఖానాపూర్‌ ఎమ్మెల్యే పనులు చేయరని, కమీషన్‌ ఇవ్వకపోతే కొబ్బరికాయ సైతం కొట్టరని భట్టి ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే గిరిజనులు, గిరిజనేతరులతోపాటు నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రశ్నపత్రాల లీకేజీకి నిరసనగా చేపట్టిన ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులతో కలిసి భట్టి దీక్షల్లో కూర్చున్నారు. అంతకుముందు మంచిర్యాల - ఆదిలాబాద్‌ రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు గండ్రత్‌ సుజాత, రవళిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌, వరంగల్‌ మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు చారులత, భరత్‌చౌహాన్‌, వెడ్మ బొజ్జు, గండ్రత్‌ ఆశన్న, రూపేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు