ఎమ్మెల్సీ ఎన్నికలపై వైకాపా ఎమ్మెల్యేలకు మాక్‌ పోలింగ్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ చిన్న పొరపాటూ జరక్కుండా అధికార వైకాపా తీవ్ర కసరత్తు చేస్తోంది.

Updated : 20 Mar 2023 06:22 IST

ఈనాడు, అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ చిన్న పొరపాటూ జరక్కుండా అధికార వైకాపా తీవ్ర కసరత్తు చేస్తోంది. పార్టీ తరఫున బరిలో దింపిన ఏడుగురు అభ్యర్థులకు ఒక్కొక్కరికీ 22మంది ఎమ్మెల్యేల చొప్పున కేటాయించింది. వీరిని ఏడు బృందాలుగా విభజించి ప్రతి బృందానికీ ఓ ఎమ్మెల్యేను సమన్వయకర్తగా నియమించింది. తెదేపా తరఫున గెలుపొంది తర్వాత వైకాపా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన నలుగురు ఎమ్మెల్యేలు, జనసేన నుంచి గెలిచి ప్రస్తుతం రాజోలు వైకాపా సమన్వయకర్తగా ఉన్న రాపాక వరప్రసాద్‌ను కూడా ఈ బృందాల్లో సభ్యులుగా చేర్చినట్లు తెలిసింది. మరోవైపు వైకాపాను వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని, నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వ తీరును ప్రశ్నించిన మరో సీనియర్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని ఈ జాబితాల్లోకి తీసుకోలేదని విశ్వసనీయ సమాచారం. అభ్యర్థులవారీగా విభజించిన ఎమ్మెల్యేల బృందాల్లో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు ఉండేలా జాబితాలను సిద్ధం చేశారు. ఆదివారం ఈ ఏడు బృందాలు వేర్వేరుగా మాక్‌ పోలింగ్‌లో పాల్గొన్నాయి. ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, అసెంబ్లీ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఈ బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో బృందాల్లోని ఎమ్మెల్యేలతో మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. నమూనా బ్యాలెట్‌పై ఓట్లను సక్రమంగా వేశారా లేదా అనే వివరాలను పరిశీలించారు. శనివారం నిర్వహించిన మాక్‌ పోలింగ్‌లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పొరపాట్లు చేసినట్లు గుర్తించారు. ఇలాంటి పొరపాట్లు 23న జరిగే అసలైన పోలింగ్‌లో దొర్లితే ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ఆదివారం అభ్యర్థుల వారీగా మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. ఎమ్మెల్యేలకు ఓటింగ్‌పై అవగాహన కల్పించారు. సోమవారం మరోసారి పూర్తిస్థాయిలో మాక్‌పోలింగ్‌ చేపట్టనున్నారు. 23న పోలింగ్‌ నేపథ్యంలో 22న రాత్రి ఎమ్మెల్యేలందరితో విందు భేటీని నిర్వహించనున్నారు.

సొంతపార్టీ శాసనసభ్యుల్లో కొందరిపై నిఘా?

ప్రతి ఓటూ కీలకమైనందున అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరి కదలికలను ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కష్టం అనే పరిస్థితి ఉన్నవారు, పార్టీ అదనపు సమన్వయకర్తలను నియమించిన నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీపై అసంతృప్తితో ఉన్నవారు, కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండని వారు.. ఇలా పలు కారణాలతో కొందరిపై వైకాపా అధిష్ఠానం దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్‌, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు, ఉమ్మడి విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే, ఇంకొందరు ఇంటెలిజెన్స్‌ పర్యవేక్షణలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని