భాజపావి బరితెగింపు దాడులు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌

కొన్ని పార్టీలు పనికట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలని భారాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

Updated : 21 Mar 2023 06:52 IST

తెలంగాణ ప్రగతికి అడ్డంకులు సృష్టిస్తోంది
కాంగ్రెస్‌, భాజపాలకు తెలివి లేదు.. విజన్‌ లేదు
అందుకే భారాసగా ప్రస్థానాన్ని ప్రారంభించాం
రాష్ట్రంలో మరోసారి గులాబీ పార్టీ విజయం తథ్యం
భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం
పార్టీ శ్రేణులకు ఆత్మీయ సందేశం విడుదల
దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: కొన్ని పార్టీలు పనికట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలని భారాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో దేశంకోసం బయలుదేరిన భారాస పార్టీపై కేంద్రంలోని భాజపా ప్రభుత్వం బరితెగింపు దాడులు చేస్తూ.. తెలంగాణ ప్రగతికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. వేల దాడులు.. లక్షల కుట్రలను ఛేదించి నిలిచి గెలిచిన పార్టీ మనదని, నాడు మనం భయపడితే తెలంగాణ వచ్చేదా? అని గుర్తుచేశారు. దేశాన్ని ఇన్నాళ్లూ పాలించిన కాంగ్రెస్‌, భాజపాలకు తెలివిలేదు.. విజన్‌ లేదు.. సంకల్పంలేదు.. అందుకే దేశానికి కొత్త ఎజెండాను నిర్దేశించి.. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భారత్‌ రాష్ట్ర సమితిగా మరో ప్రస్థానాన్ని ప్రారంభించామన్నారు. ‘‘ఏదైనా పని మొదలుపెడితే.. కడదాకా కాడి దించే అలవాటు లేని ఉక్కు సంకల్పం మనది. సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో.. మీరే నాబలం.. మీరే నాబలగం! తెలంగాణ.. చైతన్యం తొణికిసలాడే గడ్డ. ప్రజలే కేంద్రం బిందువుగా.. వారి సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్న భారాస పార్టీని తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదు. చిల్లర మల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ ఆదరించదు. తెలంగాణతో భారాసది పేగుబంధం. పురిటిగడ్డపై గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం’’ అని సీఎం కేసీఆర్‌.. భారాస శ్రేణులను ఉద్దేశించి సోమవారం విడుదల చేసిన ఆత్మీయ సందేశంలో వెల్లడించారు.

‘‘భారత్‌ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు నమస్తే!

అన్నం తినో.. అటుకులు తినో.. ఉపవాసం ఉండో.. 14 ఏళ్లు పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అధికారం లేకున్నా ఉద్యమకాలంలో జెండా భుజాన వేసుకొని.. లాఠీలకు, జైళ్లకు వెరవకుండా రేయింబవళ్లు శ్రమించి, పార్టీని కాపాడుకున్న ఘనత, కీర్తి గులాబీ సైనికులకే దక్కుతుంది. ప్రజల ఆశీర్వాదం, నిబద్ధత కలిగిన లక్షల కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి, రెండుసార్లు తెలంగాణలో భారాస అధికారపగ్గాలు చేపట్టింది. ఉద్యమవీరులుగా ఆనాడు.. నవ తెలంగాణ నిర్మాణయోధులుగా ఈనాడు.. పట్టుదల, అంకితభావంతో పనిచేస్తూ అపూర్వ విజయాలు సాధించిపెట్టింది మీరే. మీరిచ్చిన బలంతోనే 60 లక్షల సభ్యత్వంతో భారాస అజేయశక్తిగా ఎదిగింది. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఎవరికీ సాధ్యంకాని.. ఏకపక్ష విజయాలు సాధిస్తూ రికార్డులను తిరగరాసింది. 21 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, ఆటుపోట్లను తట్టుకొని, మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను ముద్దాడిన గట్టి సిపాయి మన పార్టీ!

నాకు కొండంత బలాన్ని ఇచ్చారు

కష్టసుఖాల్లో కలసి నడుస్తూ.. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్‌ అయి పల్లెల్లో.. గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి, నాకు కొండంత అండగా నిలిచిన మీరుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేను. ఇతరులకు పాలిటిక్స్‌ అంటే గేమ్‌. భారాసకు మాత్రం టాస్క్‌. రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పవిత్ర కర్తవ్యంగా భావించి, కొత్తపంథాలో నడుస్తూ కోటి ఆశలతో ఏర్పడ్డ తెలంగాణను కోటి కాంతులు విరజిమ్మే నేలగా తీర్చిదిద్దుకున్నాం.

మనం ఇలా ఉంటే.. దేశం కథ ఇంకోలెక్కన ఉంది. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కోట్లమందికి తాగడానికి నీళ్లు లేవు. తినడానికి తిండి లేదు. నదుల నిండా నీరున్నా.. పొలాలకు సాగు నీళ్లు రాలేదు. కరెంటు కష్టాలు తీరలేదు. అన్ని వనరులూ వసతులూ ఉండి కూడా భారతదేశం భంగపడుతోంది. చైనా, సింగపూర్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు అద్భుత ప్రగతిని సాధిస్తుంటే.. మనం ఇంకా కులాలు, మతాల కుమ్ములాటల్లో మునిగిపోయి, ముందడుగు వేయలేకపోతున్నాం. మన ఒక్క రాష్ట్రం బాగుంటే సరిపోదు.. దేశం కూడా బాగుండాలి. ఇది ఎన్నికల సంవత్సరం. నిరంతరం ప్రజల్లో ఉంటూ.. భారత్‌ రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత మీ భుజస్కంధాలపైనే ఉంది. ధర్మమే జయిస్తుంది’’ అని భారాస అధినేత కేసీఆర్‌.. పార్టీ శ్రేణులకు ఇచ్చిన ఆత్మీయ సందేశంలో పేర్కొన్నారు.


అప్పుడు కరవు.. ఇప్పుడు పైర్లు

ష్టాలు.. కన్నీళ్లు.. కరవులతో అల్లాడిన తెలంగాణ.. ఇవాళ పచ్చని పంటలతో.. చిరునవ్వులతో కళకళలాడుతోంది. ఆగమైపోయిన రాష్ట్రం నేడు కుదుటపడింది. కడుపు నిండా తిని.. కంటి నిండా నిద్రపోతోంది. ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. కలలో కూడా ఊహించని కార్యాలను చేపట్టి.. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేసి చూపి.. తెలంగాణను దేశానికి నమూనాగా నిలబెట్టింది భారాస ప్రభుత్వం. అడిగినవీ.. అడగనవీ.. చెప్పినవీ.. చెప్పనవీ.. ఎన్నో పనులు చేస్తూ.. అందరి బంధువుగా నిలిచాం. ఏ వర్గాన్నీ చిన్నబుచ్చలేదు. ఏ ఒక్కరినీ విస్మరించలేదు. మనకు కులం లేదు. మతం లేదు. తెలంగాణ సమాజానికి పొత్తుల సద్ది మూట భారాస. సంపదను పెంచుతూ.. ప్రజలకు పంచుతూ.. భారతదేశాన్ని సాకే అయిదారు రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించి.. ఉజ్వలంగా వెలుగొందుతోంది తెలంగాణ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని