వేధించేందుకే సిట్‌ నోటీసులు: రేవంత్‌

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వెనక ప్రధాన పాత్రధారులు, సూత్రధారుల వివరాలను వెల్లడించినందుకు.. వేధించాలనే ఉద్దేశంతోనే సిట్‌ నోటీసులు జారీ చేసిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Published : 21 Mar 2023 04:21 IST

కేటీఆర్‌, సబిత, శ్రీనివాస్‌గౌడ్‌లకూ ఇవ్వాలని డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌-కామారెడ్డి, బాన్సువాడ-న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వెనక ప్రధాన పాత్రధారులు, సూత్రధారుల వివరాలను వెల్లడించినందుకు.. వేధించాలనే ఉద్దేశంతోనే సిట్‌ నోటీసులు జారీ చేసిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం దుర్కి, నిజామాబాద్‌ జిల్లా పొతంగల్‌ మండలాల్లో సోమవారం ఆయన పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాన్సువాడ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు. నోటీసుల జారీ ఊహించిందేనని, పండగ పూట ఇంట్లో ఉండకుండా వేధించాలని సిట్‌ చూస్తోందన్నారు. తన వద్ద ఉన్న వివరాలను సిట్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. నిందితులను సిట్‌ కస్టడీలోకి తీసుకుని విచారించకముందే రాజశేఖర్‌, ప్రవీణ్‌లే ప్రధాన పాత్రధారులని మంత్రులు కేటీఆర్‌, సబిత, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పత్రికా సమావేశంలో ఎలా వెల్లడిస్తారని రేవంత్‌ ప్రశ్నించారు. వారికీ సిట్‌ నోటీసులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీపై సీబీఐ ఆధ్వర్యంలో.. దానిపై నమ్మకం లేకుంటే సిట్టింగ్‌ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, నాయకులు మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌, సురేష్‌ షెట్కార్‌, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


24, 25 తేదీల్లో ఓయూలో రేవంత్‌రెడ్డి దీక్ష

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ; విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ఈ నెల 24, 25తేదీల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ వద్ద దీక్ష చేపట్టనున్నారు. ఈమేరకు సోమవారం గాంధీభవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ నేతలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బెల్లయ్యనాయక్‌, అద్దంకి దయాకర్‌, మానవతారాయ్‌, చరణ్‌ కౌశిక్‌, సుధీర్‌రెడ్డిలతో పాటు పలు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని