వైకాపాలోనూ జగన్‌పై తీవ్ర అసంతృప్తి

ముఖ్యమంత్రి జగన్‌ స్వయంకృతాపరాధాలతోనే వైకాపా పతనం ప్రారంభమైంది. ఆయన పాలనపైనే కాదు.. ప్రజలపైనా, పార్టీపైనా, ఎమ్మెల్యేలపైనా పట్టు కోల్పోయారు.

Published : 24 Mar 2023 05:43 IST

శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ స్వయంకృతాపరాధాలతోనే వైకాపా పతనం ప్రారంభమైంది. ఆయన పాలనపైనే కాదు.. ప్రజలపైనా, పార్టీపైనా, ఎమ్మెల్యేలపైనా పట్టు కోల్పోయారు. జగన్‌పై వైకాపాలోనూ అసంతృప్తి ఉంది. 3 పట్టభద్రుల స్థానాల్లో తెదేపా గెలుపు జగన్‌కు మొదటి గుణపాఠమైతే.. పంచుమర్తి అనురాధ విజయం రెండో గుణపాఠం. గత నాలుగేళ్లలో జగన్‌ అండతో వైకాపా మూకలు పేట్రేగాయి. అన్ని వర్గాల ప్రజలూ వైకాపా విధ్వంసాల బాధితులే. ప్రజల్లో తిరుగబాటుతోనే వైకాపా ఎమ్మెల్యేలూ తిరగబడ్డారు. సగం మంది ఎమ్మెల్యేలు తిరగబడ్డా ఆశ్చర్యం లేదు.


సొంత పార్టీ నుంచే జగన్‌పై తిరుగుబాటు
- తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

నియంతలా అరాచక విధానాలతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు సొంతపార్టీ నుంచే తిరుగుబాటు మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయం ఆయనకు చెంపపెట్టు. పట్టభద్రుల ఎన్నికల్లో తెదేపా విజయానికి వైకాపా నేతలు వక్రభాష్యం చెప్పారు. ఇప్పుడు దీన్నేమంటారు? ఆఖరికి సొంతపార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినా వైకాపాకు ఓటమి తప్పలేదు.


దేవుడే స్క్రిప్టు తిరగ రాశాడేమో..
- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

జగన్‌ ఎప్పుడు మాట్లాడినా.. తెదేపాకు 23 స్థానాలని దేవుడు స్క్రిప్టు రాశాడని అంటారు. ఈ రోజు భగవంతుడు అదే స్క్రిప్టును తిరగ రాశాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘మాకు వచ్చిన ఓట్లు 23.. ఈ రోజు 23వ తేదీ.. 2023 సంవత్సరం’.. జగన్‌ చెప్పినట్లే దేవుడు స్క్రిప్టు తిరగ రాయడంతో వైకాపా పతనానికి బీజం పడింది.  మా పార్టీకి దూరమైన నలుగురు ఎమ్మెల్యేలూ ఆత్మప్రబోధానుసారం ఓట్లు వేశారని భావిస్తున్నాం. ఈ ఫలితాలు చూసిన తర్వాత సాధారణ ఎన్నికల్లో తెదేపా 175 స్థానాలు ఎందుకు గెలవకూడదు..?


అనురాధ విజయం ప్రజా విజయం: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

పంచుమర్తి అనురాధ విజయం ప్రజావిజయం. చంద్రబాబు పోరాట స్ఫూర్తికి, లోకేశ్‌ యువగళోత్సాహానికి, పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషికి వరుస విజయాలే నిదర్శనం. ఇదే స్ఫూర్తితో రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా తెదేపాను విజయపథంలో పయనింప జేసేందుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలి.


దేవుని స్క్రిప్ట్‌ అంటే ఇలానే ఉంటుంది
- తెదేపా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

2019 ఎన్నికల్లో మే 23వ తేదీన తెదేపా 23 సీట్లకే పరిమితం కావడాన్ని దేవుని స్క్రిప్ట్‌ అంటూ జగన్‌ జోకులేశారు. ఇప్పుడు అదే 23 ఓట్లతో పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. దేవుని స్క్రిప్ట్‌ ఇలా కూడా ఉంటుంది.


వైకాపా విధ్వంసాలపై తిరుబాటు
- తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామమోహన్‌రావు

అనురాధ విజయం వైకాపా విధ్వంసాలపై తిరుగుబాటుకు ప్రతీక. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు సాధించిన విజయం. తెదేపా కార్యకర్తల్లో కొత్త జోష్‌ నింపుతుంది.


దేవుడు రివర్స్‌ స్క్రిప్ట్‌ రాశాడు
- తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న

గత ఎన్నికల సమయంలో 23 సీట్లు తెదేపాకు ఇచ్చి దేవుడు స్క్రిప్ట్‌ రాశారని ఎద్దేవా చేసిన జగన్‌కు.. ఆదే 23 సీట్లతో ఝలక్‌ ఇచ్చి దేవుడు రివర్స్‌ స్క్రిప్ట్‌ రాశారు. ఇది రాజకీయ విప్లవం. జగన్‌రెడ్డిపై తిరుగుబాటు. 2023 సంవత్సరంలో 23వ తేదీన 23 మంది ఓట్లతో తెదేపాను గెలిపించి దేవుడు మంచి స్క్రిప్ట్‌ రాశాడు.


నా రాజీనామా ఆమోదమంటూ వైకాపా మైండ్‌ గేమ్‌
- తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావు

వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాకు ఓటేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే నా రాజీనామా ఆమోదించారంటూ వైకాపా మైండ్‌గేమ్‌ ఆడింది. తెదేపాలోనే ఒక ఎమ్మెల్యే ఓటు వేయలేకపోతున్నారనే భావన కలిగిస్తే వైకాపాలోని అసంతృప్తులు వెనక్కి తగ్గుతారనే ఆలోచన చేశారు. తెదేపా అభ్యర్థి అనురాధ నామినేషన్‌ పత్రాలపై ప్రపోజల్‌ సంతకం నేనే చేశాను. ఓటర్ల జాబితా వచ్చాక.. రాజీనామా ఆమోదించడమనేది సాంకేతికంగా కుదరదనే విషయాన్ని మరిచిపోయినట్లున్నారు.


చంద్రబాబే ప్రత్యామ్నాయం: తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

చంద్రబాబు నాయకత్వంపై నమ్మకాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకం మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించారు. ఇప్పుడు కూడా అదే అయిందంటే రాష్ట్రానికి చంద్రబాబే ప్రత్యామ్నాయం అనే ఆలోచన ధోరణి ఎమ్మెల్యేల్లో కూడా ఉందనేది స్పష్టమవుతోంది. ఆయన తప్ప రాష్ట్రాన్ని ఎవరూ గాడిలో పెట్టలేరనేది ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వంపై నమ్మకంలేదని ప్రజలు చూపిస్తే, ఎమ్మెల్యేలకు కూడా నమ్మకంలేదనేది ఈ ఎన్నికలు తేటతెల్లం చేశాయి.


అదే 23 తేదీ.. అదే 23 ఓట్లు: లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘మేం 23 సీట్లే గెలిచామని ఎద్దేవా చేశావు.. అందులో నలుగురిని కొన్నావు. చివరికి అదే 23వ తేదీన.. అదే 23 ఓట్లతో నీ ఓటమి-మా గెలుపు.ఇది కదా దేవుని స్క్రిప్ట్‌ అంటే జగన్‌ గారూ!’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ గురువారం ట్వీట్‌ చేశారు. ‘ఎమ్మెల్సీగా విజయం సాధించిన విజయవాడ మాజీ మేయర్‌, చేనేత ఆడపడుచు, మా తెదేపా కుటుంబ సభ్యురాలు అనురాధకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.


తాడేపల్లి.. పులివెందుల్లోనూ గెలుస్తాం
- బొండా ఉమ, మాజీ ఎమ్మెల్యే

మా పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని వైకాపా భావించింది. అందుకే ఎస్సీ వర్గానికి చెందిన మా పార్టీ ఎమ్మెల్యే స్వామిపై అసెంబ్లీలోనే దాడికి పాల్పడ్డారు. రాబోయే ఎన్నికల్లో మాదే గెలుపు. తాడేపల్లి.. పులివెందుల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినా ఇదే తరహా ఫలితాలు ఖాయం. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే నమ్మలేని పరిస్థితి జగన్‌కు వచ్చింది.


ప్రజాస్వామ్యం గెలిచింది: నక్కా ఆనంద్‌బాబు, మాజీ మంత్రి

ఈ రోజు ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని చూశాం. తమ పార్టీ ఎమ్మెల్యేలపై జగన్‌కు నమ్మకం లేక.. ఇంటెలిజెన్స్‌.. పోలీసులను వారికి కాపలా పెట్టారు. సంఖ్యాబలం ప్రకారం ఒక స్థానం తెదేపాకు వస్తుంది. ఇది తెలిసి అదనంగా మరో స్థానానికి జగన్‌ పోటీ పెట్టారు. ఇటీవల     జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపాకు ఓటర్లు విజయాన్ని కట్టబెట్టారు. రాబోయే ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారనడానికి ఇది నిదర్శనం.


అధర్మంపై.. ధర్మం గెలిచింది
- ట్విటర్‌లో తెదేపా సీనియర్‌ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ

‘జగన్‌ అరాచక పాలన అంతం కావాలని వైకాపా ఎమ్మెల్యేలే కోరుకుంటున్నారు. వారంతా రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని భావిస్తున్నారు. అధర్మంపై ధర్మం గెలిచింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్ధి అనురాధ విజయం సాధించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయంతోనే వైకాపా పతనం మొదలైంది’


బీసీలకు రాజకీయాల్లో పెద్దపీట వేసింది తెదేపానే
- ఏపీ కేశినేని నాని

మేయర్‌గా విజయవాడ నగర అభివృద్ధికి నాంది పలికిన పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా ఎన్నికవడం గర్వించదగ్గ విషయం. తెదేపా బీసీల పార్టీ అని మరోసారి నిరూపించారు. వెనుకబడిన తరగతులకు రాజకీయాల్లో పెద్దపీట వేసింది తెదేపాయే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని