అప్రజాస్వామికం.. తొందరపాటు చర్య

రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని పలువురు మంత్రులు, నేతలు ఖండించారు. వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

Updated : 25 Mar 2023 05:59 IST

రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వంపై అనర్హత వేటుపై మంత్రులు, నేతల స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని పలువురు మంత్రులు, నేతలు ఖండించారు. వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

* రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం అత్యంత అప్రజాస్వామికం. తొందరపాటు చర్య. రాజ్యాంగ హక్కులను దుర్వినియోగం చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నాను.

మంత్రి కేటీఆర్‌

* భాజపా నియంతృత్వం, దురహంకారానికి ఇది నిదర్శనం. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయి.

మంత్రి హరీశ్‌రావు

* భాజపా అనాలోచిత విధానాలకు పరాకాష్ఠ. కనీసం ప్రశ్నించే తత్వాన్ని సహించలేని స్థితిలో భాజపా నాయకత్వం ఉందన్న విషయం బోధపడుతోంది.

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

* మోదీ అసలు స్వరూపం బట్టబయలైంది. ఇది విపక్షాలను అణచివేసేందుకు మోదీ ఎంచుకున్న మార్గంగా కనిపిస్తోంది. ఎనిమిదేళ్లుగా భాజపా ప్రభుత్వం చేస్తున్న తంతు ఇదే.

మంత్రి జగదీశ్‌రెడ్డి

* ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ఈడీ, సీబీఐ వంటి జేబు సంస్థల అండతో ప్రతిపక్షాల గొంతునొక్కుతోంది. దేశ ప్రజలు త్వరలోనే భాజపాకు బుద్ధి చెబుతారు.

మంత్రి గంగుల కమలాకర్‌

* పార్లమెంటులో అక్రమాలను ప్రశ్నిస్తారనే భయం మోదీకి పట్టుకుంది. అందులో భాగంగానే రాహుల్‌గాంధీని అనర్హుడిగా ప్రకటించారు. భాజపా దుర్మార్గాలకు ప్రజలు చరమగీతం పాడుతారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్‌

* పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని భాజపా ఖూనీ చేసింది. రాహుల్‌పై అనర్హత వేటువేయడం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడవడమే. పరువు నష్టం కేసులో వేసిన శిక్షకే అనర్హత వేటు వేస్తే.. క్రిమినల్‌ కేసుల్లో శిక్షలు పడిన భాజపా ఎంపీలు ఎంతమంది ఉన్నారు?

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

* మోదీ ప్రభుత్వం తన గోతిని తానే తవ్వుకుంటోంది. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే భాజపా ప్రభుత్వ విధానం. ఈ తప్పుడు విధానాలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి.

మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

* అదానీ, అంబానీల కోసమే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోంది.

మంత్రి సత్యవతి రాథోడ్‌

* పై కోర్టుల్లో అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిసినా రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన స్నేహితులపై నుంచి దృష్టి మళ్లించడానికి ఈ చర్యకు పాల్పడ్డారు. ప్రతిపక్షాలను అణచివేయడమనే మోదీ మిషన్‌లో ఇదో పెద్ద భాగం.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

* రాహుల్‌పై అనర్హత నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రజాస్వామిక విలువలను కాపాడాలి. అప్పిలేట్‌ కోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వకుండా..అనర్హత వేటు వేయడం ఆమోదయోగ్యం కాదు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌

* ప్రధాని మోదీ ఫాసిస్టు, నిరంకుశ చర్యకు నిదర్శనం. పైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి నెలరోజుల గడువు ఉన్నప్పటికీ.. హడావిడిగా ఎంపీ పదవికి రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉంది.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు