పొలిట్‌బ్యూరో బాధ్యతల నుంచి తప్పించండి

సీపీఎం పొలిట్‌బ్యూరో బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఆ పార్టీ సీనియర్‌నేత బీవీ రాఘవులు లేఖ రాసినట్లు తెలిసింది.

Published : 25 Mar 2023 03:58 IST

పార్టీకి బీవీ రాఘవులు లేఖ!

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: సీపీఎం పొలిట్‌బ్యూరో బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఆ పార్టీ సీనియర్‌నేత బీవీ రాఘవులు లేఖ రాసినట్లు తెలిసింది. నెల రోజుల క్రితమే పొలిట్‌బ్యూరోకి ఆయన ఈ లేఖ పంపినట్లు సమాచారం. దీనిపై శని, ఆదివారాల్లో దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాఘవులు కూడా పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి ఆయన దిల్లీ వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయిలో పనిచేయడానికి వీలుగా పొలిట్‌బ్యూరో బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఆయన తన లేఖలో కోరినట్లు సమాచారం. పార్టీలో జరిగిన కొన్ని పరిణామాల పట్ల.. రాఘవులు కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

నిర్ణయం వెనుక ఏపీ పరిణామాలు?

హైదరాబాద్‌లో 2018లో జరిగిన సీపీఎం జాతీయ మహాసభలో రాజకీయ తీర్మానం విషయంలో విభేదాలు తలెత్తాయి. అదేవిధంగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత రాఘవులు కూడా పొలిట్‌బ్యూరో బాధ్యతల నుంచి తనకు సెలవు ఇప్పించాలని లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకొంది. పార్టీ అంతర్గత విషయాల్లో రాఘవులు, ఎంఏ గఫూర్‌ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరూ పార్టీ కీలక బాధ్యతలనుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం గమనార్హం. కొంతకాలం క్రితం ఏపీ రాష్ట్ర కమిటీలో జరిగిన పరిణామాలూ ఆయన పొలిట్‌బ్యూరో నుంచి బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి రావడానికి దారితీసినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర కమిటీ సమావేశాలకు ఇద్దరు..

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు రాఘవులు ఒక్కరే ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పార్టీకి సంబంధించిన అంశాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఆయా రాష్ట్రాల పార్టీ శాఖలకు మార్గదర్శనం చేస్తున్నారు. అయితే గత సంవత్సరం ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల ఎంపిక అంశంపై పార్టీలో అంతర్గతంగా వివాదానికి దారితీసింది. ఈ ఎంపికలో రాఘవులు ఏకపక్షంగా వ్యవహరించారని రాష్ట్ర నేతలు పార్టీ కేంద్ర కమిటీకి లేఖ రాసినట్లు తెలిసింది. అప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పార్టీ ముఖ్య సమావేశం జరిగిన పొలిట్‌బ్యూరో సభ్యుడిగా రాఘవులు హాజరై మార్గదర్శనం చేశారు. ఈ లేఖ తర్వాత సీపీఎం జాతీయ నాయకత్వం తెలంగాణ, ఏపీలో పార్టీ ముఖ్య సమావేశాలకు రాఘవులుతో పాటు మరో పొలిట్‌బ్యూరో సభ్యుడు కేరళకు చెందిన విజయ రాఘవన్‌ను కూడా పంపిస్తోంది. ఈ పరిణామం పట్ల రాఘవులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.  రాఘవులు లేఖ అంశం శుక్రవారం చర్చనీయాంశం అయ్యింది. ఆయన దృష్టికీ వెళ్లగా శనివారం దిల్లీలో మాట్లాడతానని, లేదంటే నాయకత్వం స్పందిస్తుందని రాఘవులు బదులిచ్చినట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని