డ్వాక్రా మహిళల పొదుపు సొమ్మును మళ్లించలేదా?

డ్వాక్రా మహిళలు దాచుకున్న రూ.10,500 కోట్ల పొదుపు సొమ్ముని ఈ ప్రభుత్వం కోఆపరేటివ్‌ సొసైటీలకు దారి మళ్లించింది నిజం కాదా? అని సీఎం జగన్‌ను తెదేపా అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ప్రశ్నించారు.

Published : 26 Mar 2023 05:29 IST

మూడో విడత రుణమాఫీ ఇప్పుడిస్తే.. నాలుగో విడత మాటేంటి?
ఆసరా వారోత్సవాల పేరుతో  ఖాళీ చెక్కులిచ్చి మోసం చేస్తున్నారు
తెదేపా నాయకురాలు ఆచంట సునీత

ఈనాడు డిజిటల్‌, అమరావతి: డ్వాక్రా మహిళలు దాచుకున్న రూ.10,500 కోట్ల పొదుపు సొమ్ముని ఈ ప్రభుత్వం కోఆపరేటివ్‌ సొసైటీలకు దారి మళ్లించింది నిజం కాదా? అని సీఎం జగన్‌ను తెదేపా అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ప్రశ్నించారు. ఆసరా వారోత్సవాల పేరుతో ఖాళీ చెక్కులిచ్చి డ్వాక్రా సంఘాల్ని జగన్‌ మోసం చేస్తున్నారని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ‘‘గతేడాది సెప్టెంబరులో ఇవ్వాల్సిన మూడో విడత ఆర్థిక సాయాన్ని ఇప్పుడిస్తే..నాలుగో విడత రుణమాఫీ ఎప్పుడు ఇస్తారు? అంటే నాలుగో విడతను ఎగ్గొట్టాలనే కాలయాపన చేశారా. చంద్రబాబు హయాంలో కోటి మంది ఉన్న డ్వాక్రా మహిళలు ఈ ప్రభుత్వంలో 78 లక్షలకు ఎందుకు తగ్గారు. ప్రతిపక్షంలో ఉండగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన రూ.27 వేల కోట్ల రుణాల్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక రూ.25 వేల కోట్లకు తగ్గించింది వాస్తవం కాదా. గత ప్రభుత్వంలో ప్రతి డ్వాక్రా మహిళకు రూ.20 వేల ఆర్థిక సాయం చేశారు. జగన్‌ దాన్ని కొంత మందికే ఎందుకు పరిమితం చేశారు. చంద్రబాబు హయాంలో రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తే.. దాన్ని రూ.3 లక్షలకు ఎందుకు పరిమితం చేశారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 16 శాతం ఉన్న ఎన్‌పీఏ(నిరర్థక ఆస్తులు)లను చంద్రబాబు 1.3 శాతానికి తగ్గించారు. కానీ చంద్రబాబు హయాంలో ఎన్‌పీఏలు 18 శాతమని ఎందుకు దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఈ నాలుగేళ్లలో డ్వాక్రా సంఘాలకు చేసిన సాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఒకరకంగా, అర్బన్‌ ప్రాంతాల్లో మరో రకంగా రుణమాఫీని అమలు చేస్తున్నారు’’ అని ఆచంట సునీత మండిపడ్డారు. ఆడిటింగ్‌ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి డ్వాక్రా సంఘం నుంచి రూ.650 బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘మహిళా మార్ట్‌ పేరుతో ప్రతి డ్వాక్రా మహిళ నుంచి రూ.రెండు వందల వరకు వసూలు చేస్తున్నారు. ఇందేంటని ప్రశ్నిస్తే అమ్మఒడి, ఆసరా వస్తుంటే రూ.200 ఎందుకివ్వరని వాలంటీర్లు బెదిరిస్తున్నారు. తెదేపా హయాంలో ఇలా ఎన్నడూ వసూలు చేసింది లేదు’’ అని సునీత పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని