డాక్టర్‌ అచ్చెన్న హత్యపై విచారణ చేపట్టాలి

వైయస్‌ఆర్‌ కడప జిల్లాలో బహుళార్థ పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డా. అచ్చెన్నను ఉన్నతాధికారులే హత్య చేయించి ఉంటారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అనుమానం వ్యక్తం చేశారు.

Updated : 26 Mar 2023 05:58 IST

జాతీయ ఎస్సీ కమిషన్‌, డీజీపీలకు వర్ల రామయ్య ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైయస్‌ఆర్‌ కడప జిల్లాలో బహుళార్థ పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డా. అచ్చెన్నను ఉన్నతాధికారులే హత్య చేయించి ఉంటారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అనుమానం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఎస్సీ అధికారులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్న అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు చేయించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్‌, రాష్ట్ర డీజీపీలకు శనివారం వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. డా.సుధాకర్‌ మరణం మరువక ముందే అచ్చెన్న అనుమానాస్పద మృతి బాధాకరం అని ఆవేదన చెందారు. సహోద్యోగులు హింసిస్తున్నారని కలెక్టర్‌ సహా ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. కులం పేరుతో దూషించి మానసికంగా హింసిస్తున్నారని అచ్చెన్న కుమారుడికీ వివరించారని, ఈ లోపే ఆయన మృతదేహాన్ని కుళ్లిపోయిన స్థితిలో గుర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ చేపట్టి.. రాష్ట్రంలో ఎస్సీ ఉద్యోగుల్ని కాపాడాలన్నారు.

దళిత ఉద్యోగి హత్య దారుణం

సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అధికారి అచ్చెన్న మృతి దారుణమని తెదేపా ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు మండిపడ్డారు. వైకాపా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు, బెదిరింపులు, హత్యలు పెరిగిపోయాయని ఓ ప్రకటనలో ఆరోపించారు.

అచ్చెన్న మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి

కడప జిల్లా పశుసంవర్థక శాఖ సంచాలకుడు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్న మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని