వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చేతులు నరుక్కున్నట్లే!: మంత్రి ధర్మాన

‘తరతరాలుగా ఉన్న ఆధిపత్యం పోయింది. జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేస్తే మీ చేతులు మీరు నరుక్కున్నట్లే...’ అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.

Updated : 28 Mar 2023 09:06 IST

గార, న్యూస్‌టుడే: ‘తరతరాలుగా ఉన్న ఆధిపత్యం పోయింది. జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేస్తే మీ చేతులు మీరు నరుక్కున్నట్లే...’ అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా గారలో సోమవారం జరిగిన వైఎస్‌ఆర్‌ ఆసరా లబ్ధిదారులకు చెక్కు పంపిణీ సభలో ఆయన మాట్లాడారు. ‘ఓటు ద్వారా మీరు కల్పించిన అధికారం ఇంకా సంవత్సరం ఉంది. ఆ తరువాత మీరు ఇంకొకరికి ఓటు వేస్తే ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి. ఓటు ద్వారా అధికారాన్ని వైకాపా ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రస్తుతం అందుకుంటున్న పథకాలు,  పొందుతున్న గౌరవం, కుటుంబ హోదా పెరగడం, పిల్లలు హాయిగా చదువుకోవడం.. ఇంటికి యజమానురాలిగా నిలబడడానికి కారణమైన పార్టీ, వ్యక్తి, గుర్తు మీకు జ్ఞాపకం ఉండాలి. మన జీవితాలు బాగుపడటానికి అవసరమైంది ఏ ప్రభుత్వమో.. ఏ నాయకత్వం అవసరమో ఆలోచన చేసి గుర్తించాలి. జగన్‌మోహన్‌రెడ్డి పిచ్చోడు.. క్రాకుడు.. సైకో అని అంటుంటారు. టీవీ సీరియళ్లు చూస్తున్నప్పుడు ఇలాంటి ప్రకటనలు వస్తుంటాయి. మీ కుటుంబం పొందుతున్న గౌరవం, మీ ఆనందానికి కారణమైన వ్యక్తి సైకో, పిచ్చోడు అంటే నమ్ముతారా? మీ ఓటు లాక్కోడానికి కొందరు చేస్తున్న పని ఇది. ఈ దొంగలందరూ మీ ఇళ్ల పక్కన, మీ వీధుల్లో.. మీ ఊళ్లలో దాగి ఉన్నారు. ప్రభుత్వ ధనాన్ని దోచుకుతిన్న దొంగలందరూ ఈ ప్రభుత్వం వద్దని చెప్తారు. ప్రయోజనం పొందే మీరు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి’అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని