కాంగ్రెస్‌ వ్యాఖ్యలు అర్థరహితం

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రాహుల్‌ గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌, వారికి మద్దతుగా నిలుస్తున్న పార్టీలు చేస్తున్న రాద్ధాంతం అర్థరహితమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 29 Mar 2023 05:49 IST

ప్రమాదంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు ఆ పార్టీనే
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్య

ఈనాడు, దిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రాహుల్‌ గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌, వారికి మద్దతుగా నిలుస్తున్న పార్టీలు చేస్తున్న రాద్ధాంతం అర్థరహితమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలో ప్రమాదంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని, తన విధానాలతో కాంగ్రెస్‌ పార్టీయే ప్రమాదంలో పడుతోందని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పులను తప్పుబడుతుండటం హాస్యాస్పదమన్నారు. పార్లమెంట్‌ ఆవరణలో మంగళవారం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కోర్టు తీర్పులతో ఎంపీలు, ఎమ్మెల్యేలు సభ్యత్వాన్ని కోల్పోవడం ఇదేం తొలిసారి కాదన్నారు. ఇటీవల లక్షద్వీప్‌ ఎంపీ ఎండీ ఫైజల్‌, అంతకుముందు నాటి తమిళనాడు సీఎం జయలలిత వంటి ఎందరో కోర్టు తీర్పులతో తమ సభ్యత్వాలకు దూరమైన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటున్న రాహుల్‌ ఒక్కసారి చరిత్రలోకి తొంగిచూడాలన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ 50 సార్లు, ఆ కుటుంబ పాలనలో మొత్తం 76 సార్లు ఆర్టికల్‌ 356(రాష్ట్రపతి పాలన) ప్రయోగించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేబినెట్‌ చేసిన ఆర్డినెన్స్‌ను మీడియా ముందు రాహుల్‌ చించివేశారని, ఆ చర్య రాజ్యాంగబద్ధమైనదా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన రాజకీయ అపరిపక్వతతో నోటిదురుసు వ్యాఖ్యలు చేయడమే కాకుండా వాటిని సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు. రాహుల్‌ పార్లమెంటు సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తున్న పార్టీలు వారి రాష్ట్రాల్లో ఎంతవరకు ప్రజాస్వామ్య విలువలు కాపాడుతున్నాయో చూసుకోవాలని హితవు పలికారు. కోర్టు తీర్పులను వ్యతిరేకిస్తున్న రాహుల్‌ కుటుంబం ప్రజాస్వామ్యంపై మాట్లాడే నైతిక హక్కును కోల్పోయిందన్నారు. ఇందిరాగాంధీ అలహాబాద్‌ కోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకించి ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని గుర్తుతెచ్చుకుంటే మేలన్నారు. 2013 నుంచి దేశవ్యాప్తంగా అనర్హతకు గురైన ఎంపీలు/ఎమ్మెల్యేల జాబితాను కేంద్ర మంత్రి విడుదల చేశారు. అన్నిపార్టీల వారిపైనా అనర్హత వేటు పడిందని, ఎవరూ ప్రజాస్వామ్య విరుద్ధమని ప్రకటనలు చేయలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని