వివేకా హత్య కేసు నుంచి బయటపడేందుకు అమిత్‌షాతో జగన్‌ ఒప్పందం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు చేరుకోవడంతోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీకి పరుగులు పెడుతున్నారు.

Updated : 31 Mar 2023 06:31 IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: ‘మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు చేరుకోవడంతోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీకి పరుగులు పెడుతున్నారు. కేసు నుంచి బయట పడేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సీఎం రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నారు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తిరుపతిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘కేసులో శిక్ష తప్పదని భావించిన ముఖ్యమంత్రి త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో వంద సీట్లలో భాజపా అభ్యర్థులను గెలిపించేలా చేస్తానని అమిత్‌షాకు మాట ఇచ్చారు. సీఎం సంపాదించిన అక్రమ ఆస్తులన్నీ కర్ణాటక ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల కోసం ఖర్చు చేయబోతున్నారు. భాజపాతో ఆయన చేసుకున్న ఒప్పందం కారణంగా వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు మరింత ఆలస్యం కాబోతుంది’ అని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇప్పటి వరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. దేశం నుంచి లండన్‌కు పారిపోయిన లలిత్‌ మోదీ.. రాహుల్‌గాంధీపై అక్కడ కేసు పెట్టి కోర్టుకు పిలిపిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోదీకి ఆర్థిక నేరగాళ్ల మద్దతు ఉందని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని నారాయణ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని