ప్రతి జిల్లాలో నిరుద్యోగ మార్చ్‌

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ప్రతిజిల్లాలో అయిదు వేల నుంచి 10 వేల మందితో నిరుద్యోగ మార్చ్‌ చేపడతామని, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలోనూ మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని.

Published : 01 Apr 2023 02:29 IST

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ఆందోళనలు ఉద్ధృతం
ప్రజల్లోకి భారాస వైఫల్యాలు
పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి వేర్వేరు కార్యక్రమాలు
భాజపా విస్తృతస్థాయి సమావేశంలో బండి సంజయ్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ప్రతిజిల్లాలో అయిదు వేల నుంచి 10 వేల మందితో నిరుద్యోగ మార్చ్‌ చేపడతామని, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలోనూ మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా విస్తృత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ అధ్యక్షతన భాజపా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జులు తరుణ్‌ఛుగ్‌, సునీల్‌ బన్సల్‌, సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌, ముఖ్యనేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జి.ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, బంగారు శ్రుతి పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఏవీఎన్‌ రెడ్డిని సన్మానించారు. అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ... ‘టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై అసెంబ్లీ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలి. ఏప్రిల్‌ 5 నాటికి పోలింగ్‌ బూత్‌ కమిటీల నియామకం వంద శాతం పూర్తి చేయాలి. ఆయా కమిటీలతో ప్రధాని నేరుగా మాట్లాడనున్నారు. 6న భాజపా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి పోలింగ్‌ బూత్‌లో పార్టీ పతాకావిష్కరణ చేయాలి. 8న ప్రధాని రాక నేపథ్యంలో చేపట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. 10న బూత్‌ స్వశక్తీకరణ్‌ అభియాన్‌ను పూర్తి చేయాలి. 6న పులే, 14న అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమాలను నిర్వహించాలి. న్యాయవాది వారోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 6నుంచి 14వరకు రోజుకో కార్యక్రమం ఉంటుంది. 30న జరిగే ప్రధాని మోదీ మన్‌కీబాత్‌ వందో ఎపిసోడ్‌ను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం వంద మందికి తగ్గకుండా జనంతో వంద సెంటర్లలో నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మే నెలంతా విస్తృతంగా ప్రచారం చేయాలి. మే రెండో వారంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 500 మంది క్రియాశీలక కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహించాలి. జూన్‌ 1నుంచి ఇంటింటికీ భాజపా కార్యక్రమంచేపట్టి.. భారాస ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేయాలి’అని పేర్కొన్నారు.


ఆరోపణలు తిప్పికొట్టాలి

కిషన్‌రెడ్డి

ప్రధాని మోదీ తెలంగాణలో నెలకు ఒకసారైనా అధికారికంగా పర్యటించాలని భావిస్తున్నట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు. ‘కేంద్రంపై భారాస చేస్తున్న ఆరోపణలను బలంగా తిప్పికొట్టాలి. ఏప్రిల్‌ 8న హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని రూ.13,500 కోట్లతో చేపట్టిన వివిధ పనులను ప్రారంభిస్తారు. ఎనిమిదిన్నరేళ్లుగా కేంద్రం తెలంగాణలో ఏయే కార్యక్రమాలకు ఎంత ఖర్చు పెట్టిందనే పూర్తి వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని త్వరలో విడుదల చేస్తాం’ అని వివరించారు. పార్టీలో చేరికలపై దృష్టి సారించాలని శివప్రకాశ్‌ సూచించారు.


సంస్థాగత ఎన్నికల తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడి మార్పు

తరుణ్‌ఛుగ్‌  

సంస్థాగత ఎన్నికల తర్వాతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందని భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌ స్పష్టంచేశారు. శుక్రవారం రాత్రి మీడియాతో ఆయన మాట్లాడుతూ... త్వరలోనే విజయసంకల్ప యాత్రల షెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు. లిక్కర్‌ మాఫియాతో కేసీఆర్‌ కుటుంబానికున్న బంధం బయటపడిందని, కేసీఆర్‌ సర్కారు మునిగిపోయే నావ లాంటిది అని అభివర్ణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని