అవినీతి.. లంచగొండి సర్కార్‌

భారాస అంటే అవినీతి(భ్రష్టాచార్‌), లంచగొండి(రిష్వత్‌) సర్కార్‌ అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభివర్ణించారు. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్‌ అప్పుల పాలు చేశారన్నారు.

Published : 01 Apr 2023 02:29 IST

భారాస నిర్వచనం అదే
ఆ పార్టీకి వీఆర్‌ఎస్‌ ఇవ్వాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించారు:  జేపీ నడ్డా

ఈనాడు, సంగారెడ్డి: భారాస అంటే అవినీతి(భ్రష్టాచార్‌), లంచగొండి(రిష్వత్‌) సర్కార్‌ అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభివర్ణించారు. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్‌ అప్పుల పాలు చేశారన్నారు. తెరాస పేరును భారాసగా మార్చుకున్నా... వారి తీరు మారలేదన్నారు. మద్యం కేసులో ఏకంగా సీఎం కుమార్తెను ఈడీ విచారణకు పిలవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా (ఈ సామెతను ఆయన తెలుగులో ప్రస్తావించారు) వారి పరిస్థితి ఉందని, అందుకే తెలంగాణ ప్రజలు భారాసకు వీఆర్‌ఎస్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. సంగారెడ్డి, జనగామ, వరంగల్‌, జయశంకర్‌-భూపాలపల్లి, మహబూబాబాద్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరులలో నిర్మించిన పార్టీ జిల్లా కార్యాలయాల భవనాలను ఆయన శుక్రవారం దిల్లీ నుంచి వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన సభను ఉద్దేశించి నడ్డా మాట్లాడుతూ... ‘ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది. దేశాన్ని 200 ఏళ్లు పాలించిన బ్రిటన్‌ను వెనక్కి నెట్టి భారత్‌ అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేద్దాం.  ఓబీసీలను ఉద్దేశించి రాహుల్‌ అభ్యంతరకర ఆరోపణలు చేశారు. కనీసం క్షమాపణ చెప్పాలని కోర్టు సూచించినా ఆయన వినడం లేదు. రాహుల్‌కు, కాంగ్రెస్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారు’ అని స్పష్టంచేశారు.

దొంగల చేతికే తాళాలిస్తారా?: సంజయ్‌

టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయకుండా ఇప్పుడున్న బోర్డు, ఉద్యోగులతోనే పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతుండటం దొంగల చేతికే తాళాలు అప్పగించినట్లుగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో మంత్రి కేటీఆర్‌ను తక్షణం బర్తరఫ్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌, సహ ఇన్‌ఛార్జి అరవింద్‌ మేనన్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, పార్టీ మధ్యప్రదేశ్‌ ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు తదితరులుపాల్గొన్నారు.

రైతుల కోసం పోరాడుతున్న వారిపై దాడులు చేయడం హేయమైన చర్య అని శుక్రవారం బండి సంజయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై వైకాపా కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని