కాంగ్రెస్‌కు పట్టిన గతే భాజపాకు..!

తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన రైతులు, పేద, దిగువ మధ్యతరగతి ప్రజల నుంచి పెట్రోల్‌, డీజిల్‌లపై సెస్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ.89,967 కోట్లు దోచుకుందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

Updated : 01 Apr 2023 05:28 IST

సెస్సు రూపంలో ప్రజల నుంచి రూ.89,967 కోట్లు దోచుకున్న కేంద్రం: మంత్రి హరీశ్‌రావు

శివ్వంపేట, న్యూస్‌టుడే: తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన రైతులు, పేద, దిగువ మధ్యతరగతి ప్రజల నుంచి పెట్రోల్‌, డీజిల్‌లపై సెస్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ.89,967 కోట్లు దోచుకుందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం దొంతిలో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తాను మాట్లాడుతూ.. నిధులన్నీ చిత్తూరు జిల్లాకే కేటాయిస్తారా? తెలంగాణ ప్రాంతానికి తాగునీటి కోసమూ నిధులివ్వరా అని నిలదీయగా, ఒక్క రూపాయి ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోపో అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని గుర్తుచేశారు. అయినా అప్పటి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒక్క మాటా మాట్లాడక పోవడంతో ఇక్కడి ప్రజలు ఆ పార్టీకి డిపాజిట్లు రాకుండా తగిన బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన యూనివర్సిటీలు, వైద్య, నర్సింగ్‌ కళాశాలలు, ఫ్యాక్టరీలు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్న భాజపాకు కూడా కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని అన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు 157 వైద్య కళాశాలలు మంజూరు చేసినా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకుండా ఎన్డీయే సర్కారు అన్యాయం చేసిందన్నారు. అన్ని విషయాల్లో తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని విమర్శించారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు దేవేందర్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని