‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ వేగవంతం చేయండి

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కారణంగా దీనికి కొంత విరామం వచ్చిందని, మళ్లీ అన్ని నియోజకవర్గాల్లోనూ వెంటనే ప్రారంభించి ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించారు.

Updated : 01 Apr 2023 06:39 IST

నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కారణంగా దీనికి కొంత విరామం వచ్చిందని, మళ్లీ అన్ని నియోజకవర్గాల్లోనూ వెంటనే ప్రారంభించి ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ఏప్రిల్‌ మొదటి వారంలో మూడు జోనల్‌ సమావేశాలను పూర్తి చేసి తాను కూడా పలు జిల్లాల్లో కార్యక్రమాలకు హాజరవుతానని తెలిపారు. క్లస్టర్‌, నియోజకవర్గ బాధ్యులతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ప్రజా సమస్యలపై గట్టి పోరాటాలు చేసి మంచి ప్రజాప్రతినిధులుగా పేరు తెచ్చుకోవాలని కొత్తగా ఎన్నికైన తెదేపా ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేశాక ఎమ్మెల్సీలు.. ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిశారు.

జగన్‌.. కియాపై సమాధానమివ్వగలవా?

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కియాపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు సమాధానమివ్వగలవా జగన్‌? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక కియాను తరిమేస్తానంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యల వీడియోలను యువగళం కార్యక్రమంలో లోకేశ్‌ విడుదల చేశారు. అప్పటి జగన్‌ వ్యాఖ్యలు, తాజాగా లోకేష్‌ సెల్ఫీ ఛాలెంజ్‌లను ప్రస్తావిస్తూ వీడియోలతో చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

ఎంత పెద్ద ఫ్యాక్టరీ అయినా వెనక్కి

‘ఈ ఒక్క సంవత్సరం ఎలాగో తట్టుకుని ఆపే కార్యక్రమాన్ని కలిసికట్టుగా చేసుకుందాం. మీకు ఇష్టం లేకుండా బలవంతంగా భూములు తీసుకునే కార్యక్రమం చేస్తే.. ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా ఇక్కడికొచ్చి దగ్గరుండి వెనక్కి పంపిస్తా’ అని ప్రతిపక్ష నేతగా జగన్‌ అప్పట్లో చెప్పిన మాటలు, ఇప్పుడు లోకేశ్‌ ప్రశ్నలు సంధిస్తున్న వీడియోను ట్విటర్‌లో చంద్రబాబు జత చేశారు. ‘ఆనాడు జగన్‌ ఇదే కియా దగ్గరకొచ్చి ఇది ఫేక్‌ అన్నారు. భూదందా కోసం తీసుకున్నారన్నారు. ఉద్యోగాలు రావన్నారు. భూముల్ని మళ్లీ రైతులకు ఇస్తామన్నారు. ఇప్పుడు జగన్‌ను అడుగుతున్నా. కియా మోటార్స్‌ ఫేక్‌గా కన్పిస్తోందా? 25వేల మంది పనిచేయడాన్ని ఫేక్‌ అంటారా? వందల అనుబంధ పరిశ్రమలు వచ్చేది, లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు కన్పించేది ఫేక్‌గా కన్పిస్తుందా?’ అని ఆ వీడియోలో లోకేశ్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని