తెనాలి పురపాలికలో వైకాపా వీరంగం

గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సమావేశం శుక్రవారం అట్టుడికిపోయింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన పనులు చేసేందుకు టెండరు పిలిచి కౌన్సిల్‌ ఆమోదానికి పెట్టారు.

Updated : 01 Apr 2023 07:27 IST

తెదేపా కౌన్సిలర్‌పై దాడి
సింగిల్‌ టెండర్లతో నష్టమనడంతో ఘర్షణ

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సమావేశం శుక్రవారం అట్టుడికిపోయింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన పనులు చేసేందుకు టెండరు పిలిచి కౌన్సిల్‌ ఆమోదానికి పెట్టారు. ఆ పనులపై ప్రతిపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టారు. తెదేపా 20వ వార్డు సభ్యుడు దేసు యుగంధర్‌ మాట్లాడుతూ ఈ పనులకు ఒక్క గుత్తేదారు మాత్రమే 0.01 శాతం  తక్కువకు టెండర్లు వేశారని, వాటిని ఆమోదించవద్దని కోరారు. అంతా నిబంధనల మేరకే జరిగిందని వాయిదా అనవసరమని వైకాపా సభ్యుడు ఆవుల కోటయ్య ఛైర్‌పర్సన్‌ సయ్యద్‌ ఖాలెదా నసీమ్‌ దృష్టికి తీసుకెళ్లారు. వైకాపా సభ్యులు మొగల్‌ రహమత్‌ బేగ్‌, షేక్‌ మహబూబ్‌ బాషా, షేర్‌ నూర్‌ ఇస్మాయిల్‌ తెదేపా సభ్యుడిపై ఎదురుదాడికి దిగారు. పరస్పరం నువ్వు కూర్చో.. అంటే నువ్వు కూర్చో అంటూ సంబోధించుకున్నారు. యుగంధర్‌పైకి దూసుకొస్తున్న బేగ్‌ను పలువురు కౌన్సిలర్లు అడ్డుకుని వారించబోయారు. అయినా  విడిపించుకొని యుగంధర్‌పై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు కురిపిస్తూ, మీసం మెలేస్తూ, వేలుపెట్టి చూపిస్తూ హెచ్చరించారు. మరికొందరు కౌన్సిలర్లు ఆయనకు తోడై యుగంధర్‌ను కొట్టారు. బల్లల మీదుగా తెదేపా సభ్యుడు ఉన్న చోటుకు బేగ్‌ దూకి మరీ.. ముష్టిఘాతాలు కురిపించారు. తెదేపా మహిళా కౌన్సిలర్లను దూషించారు. దీనికి నిరసనగా తెదేపా సభ్యులు 8 మంది ఛైర్‌పర్సన్‌ పోడియం ఎదుట భైఠాయించి నిరసన తెలిపారు. తమ సభ్యుడిపై దాడికి పాల్పడిన కౌన్సిలర్లు రహమత్‌బేగ్‌, నూర్‌ ఇస్మాయిల్‌, మహబూబ్‌ బాషా, తోట రఘురామ్‌లను సస్పెండ్‌ చేయాలని డిమాండు చేశారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. పోలీసులు స్పందించకపోవడంతో అక్కడే భైఠాయించి ఆందోళన చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని