Andhra News: పుట్టపర్తిలో ఉద్రిక్తత.. పల్లె రఘునాథ రెడ్డి కారును ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి హనుమాన్‌ జంక్షన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుట్టపర్తి అభివృద్ధిపై తెదేపా నేత పల్లె రఘునాథరెడ్డి, వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి  పరస్పర సవాళ్లతో ఆ ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Updated : 01 Apr 2023 13:52 IST

పుట్టపర్తి : శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి హనుమాన్‌ జంక్షన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుట్టపర్తి అభివృద్ధిపై తెదేపా నేత పల్లె రఘునాథరెడ్డి, వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి  సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఆ ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవల నారా లోకేశ్‌ పాదయాత్ర పుట్టపర్తిలో జరిగింది. ఈ సమయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని, లోకేశ్‌ను విమర్శిస్తూ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. దీనిపై తెదేపా వర్గాలు తీవ్రంగా స్పందించాయి. పుట్టపర్తి అభివృద్ధి ఏ మేరకు చేశారో చర్చకు రావాలని పల్లె రఘునాథరెడ్డి.. వైకాపా ఎమ్మెల్యేకు సవాలు విసిరారు. స్థానిక సత్తెమ్మ ఆలయం వద్ద చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వేదిక ఏర్పాటు కోసం పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి తెదేపా కార్యాలయానికి వచ్చారు. దీంతో పోలీసులు ఆయన్ని తెదేపా కార్యాలయంలోనే నిర్బంధించారు. మరోవైపు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో గృహనిర్బంధం చేశారు.

అయితే తెదేపా కార్యాలయం గోడ దూకి పల్లె రఘునాథరెడ్డి హనుమాన్‌ జంక్షన్‌కు వెళ్లారు. అప్పటికే అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్న వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. పల్లె రఘునాథరెడ్డి కారును ధ్వంసం చేశారు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తెదేపా, వైకాపా కార్యకర్తలు పరస్పరం చెప్పులు విసురుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. పల్లె రఘునాథరెడ్డిని అరెస్టు చేశారు.

దేవుని ముందు పల్లె రఘునాథరెడ్డి ప్రమాణం..

ఆ తర్వాత పోలీసుస్టేషన్‌ నుంచి సత్తెమ్మ ఆలయానికి చేరుకున్న పల్లె రఘునాథరెడ్డి ప్రమాణం చేశారు. వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారని.. అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా లోకేశ్‌.. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అవినీతిపై  మాట్లాడినవన్నీ వాస్తవాలేనని అన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి వస్తే ఆధారాలతో సహా నిరూపిస్తామని సవాలు విసిరారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని