KVP: చంద్రబాబు ముందుంటే వెనక నడుస్తాం!

‘మీ శక్తి సామర్థ్యాలు తక్కువేం కాదు.. ఎంతో రాజకీయ చతురత ఉంది.  దేశ రాజకీయాలకు కేంద్ర బిందువు కాగల శక్తి ఉంది. ఎన్డీఏ కన్వీనర్‌గా పనిచేశారు. దిల్లీలో చక్రం తిప్పారు.

Updated : 02 Apr 2023 09:59 IST

జగన్‌కు ఎందుకు సలహాలు ఇవ్వడం లేదో తరవాత చెబుతా
మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు

ఈనాడు, అమరావతి: ‘మీ శక్తి సామర్థ్యాలు తక్కువేం కాదు.. ఎంతో రాజకీయ చతురత ఉంది.  దేశ రాజకీయాలకు కేంద్ర బిందువు కాగల శక్తి ఉంది. ఎన్డీఏ కన్వీనర్‌గా పనిచేశారు. దిల్లీలో చక్రం తిప్పారు. దేశంలో రాజకీయ పరిస్థితులపై పోరాటంలో మీరు ముందుండండి.. మీ వెనక మేము ఉంటాం’ అని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని ఉద్దేశించి అన్నారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టిన వారు.. మైత్రీ బంధం వల్ల ప్రశ్నించలేకపోయినా.. తప్పును తప్పు అని చెప్పాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు దిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టినప్పుడు కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, మన్మోహన్‌సింగ్‌ వచ్చి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఏపీలో 25 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 175 ఎమ్మెల్యేలు ఉంటే.. ఒక్కరూ నోరు మెదపలేదని కేవీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రత్యేక పరిస్థితుల్లో భాజపాను వ్యతిరేకించి మాట్లాడటం లేదన్నారు. ఆ ప్రత్యేక పరిస్థితులేమిటో మరోసారి వివరిస్తానని చెప్పారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఆత్మ బంధువుగా వ్యవహరించిన మీరు జగన్‌కు ఎందుకు సలహాలు ఇవ్వడం లేదని ఓ విలేకరి ప్రశ్నించగా.. సమాధానం చెప్పగలను కానీ ప్రస్తుతం చెప్పలేనని మరోసారి చెబుతానని అన్నారు. మోదీ, అదానీ అవిభక్త కవల పిల్లలని కేవీపీ అభివర్ణించారు. మోదీ పీఎం అయిన తర్వాతే అదానీ ఆస్తులు పెరిగిపోయాయన్నారు. మనం చెల్లించే విద్యుత్తు బిల్లులో పైసాపైసా అదానీకి, అక్కడి నుంచి మోదీకి వెళుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ, ఏఐసీసీ సభ్యుడు కొలనుకొండ శివాజీ పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని