Nara Lokesh:అధికారంలోకి వస్తే ఏటా జాబ్‌ క్యాలెండర్‌

జాబ్‌ క్యాలెండర్‌ పేరిట యువత, నిరుద్యోగుల్ని సీఎం జగన్‌ మోసం చేశారని నారా లోకేశ్‌ విమర్శించారు.

Updated : 06 Apr 2023 06:05 IST

జగన్‌లా మాట తప్పే వ్యక్తిని కాదు
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: జాబ్‌ క్యాలెండర్‌ పేరిట యువత, నిరుద్యోగుల్ని సీఎం జగన్‌ మోసం చేశారని నారా లోకేశ్‌ విమర్శించారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన జగన్‌ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చింది లేదన్నారు. ఏటా 6,500 పోలీసు కొలువులు, మెగా డీఎస్సీ అని చెప్పి మోసం చేశారన్నారు. యువగళం పాదయాత్ర 61వ రోజు బుధవారం అనంతపురం గ్రామీణం పరిధిలోని ఎంవైఆర్‌ కల్యాణమండపం నుంచి ఉరవకొండ నియోజకవర్గం కూడేరు వరకు సాగింది. ఉరవకొండ సరిహద్దులో ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కూడేరులో జరిగిన బహిరంగసభలో లోకేశ్‌ మాట్లాడారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడంతో పాటు పక్కాగా అమలు చేస్తామన్నారు. విశాఖ, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో మూసేసిన స్టడీ సర్కిళ్లను తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరిచారని లోకేశ్‌ విమర్శించారు. ‘‘చెత్త లిక్కర్‌ తయారు చేసి రోజుకు కమీషన్‌ రూపంలో రూ.3 కోట్లు జేబులో వేసుకుంటున్నారు. రూ.15లకు తయారయ్యే మందును రూ.100కు అమ్ముతున్నారు. లిక్కర్‌లోనే జగన్‌ ఆదాయం నెలకు రూ.100 కోట్లు. ఎన్నికల ముందు ట్రాక్టర్‌ ఇసుక రూ.వెయ్యి ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.7 వేలకు చేరింది. ఇళ్ల స్థలాల్లోనూ రూ.వేల కోట్ల స్కాం చేశారు’’ అని విమర్శించారు.  
నారా లోకేశ్‌ ఎన్నికల్లో విజయం కోసం పాదయాత్ర చేయడం లేదని.. రాష్ట్రంలోని జనం కోసం, రేపటితరం భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో నడుస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. యువగళం ప్రారంభమైన నాటి నుంచి లోకేశ్‌ను ప్రభుత్వం ఇబ్బందిపెడుతోందన్నారు. ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా ప్రజల కోసం నిలబడ్డారన్నారు. లోకేశ్‌ వారసుడు కాదని.. ఎంత కష్టమొచ్చినా జనం కోసం నిలబడగలిగిన నాయకుడని తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలనను అంతం చేయడానికి యువగళం అనే నిప్పురవ్వ అంటించారన్నారు. అది భవిష్యత్తులో దావాగ్నిలా మారి జగన్‌ అరాచక పాలనను దహనం చేస్తుందన్నారు.

లోకేశ్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం

యువగళం పాదయాత్రలో లోకేశ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కూడేరులో కార్యకర్తలు గజమాలను క్రేన్‌ సాయంతో ఆయనకు వేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గజమాల ఒకవైపు తెగిపోయి లోకేశ్‌ ఎడమ భుజాన్ని తాకుతూ పడిపోయింది. కార్యకర్తలు అప్రమత్తమై గజమాలను పక్కకు తీసేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని