Roja - Rajinikanth: రజనీకాంత్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం: మంత్రి రోజా

ఎన్టీఆర్‌ శతజయంతి సభకు పిలిచినందుకే చంద్రబాబును రజనీకాంత్‌ పొగిడారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.

Updated : 30 Apr 2023 09:33 IST

బాపట్ల, సత్తెనపల్లి, గుడివాడ, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ శతజయంతి సభకు పిలిచినందుకే చంద్రబాబును రజనీకాంత్‌ పొగిడారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. బాపట్లలో శనివారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ జయంతి సభలో రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు 2004 వరకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఉన్నారన్నారు. గత 20 ఏళ్లలో బాబు లేకుండానే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

ఆయనో పిరికిపంద: మంత్రి అంబటి 

రాజకీయాల్లోకి వస్తానని చెప్పి, పారిపోయిన పిరికిపంద సినీ నటుడు రజనీకాంత్‌ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రాజకీయాల గురించి మాట్లాడే అర్హత రజనీకి లేదన్నారు. ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించినప్పుడు కూడా చంద్రబాబు పక్కనే రజనీకాంత్‌ కూర్చున్నారని ఇటీవలే తనకు తెలిసిందన్నారు.

రజనీ ఇక్కడ జీరో: కొడాలి నాని

‘రజనీకాంత్‌ తమిళనాడులో హీరో కావచ్చు, ఇక్కడ మాత్రం జీరో. అతను చెబితే మేం చంద్రబాబు గురించి తెలుసుకోవాలా?’ అని ఎమ్మెల్యే కొడాలి నాని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. విజయవాడలో జరిగిన శతజయంతి ఉత్సవాల్లో ఎన్టీఆర్‌ గురించి గొప్పలు చెప్పిన రజనీకాంత్‌, ఆనాడు ఆయనపై వైస్రాయ్‌ హోటల్‌ వద్ద దాడి జరిగినప్పుడు ఎందుకు రాలేదన్నారు. చంద్రబాబు విజన్‌ గురించి మాట్లాడితే ఇక్కడ పట్టించుకునే వారెవరూ లేరన్నారు. మూడు రోజులు షూటింగ్‌ చేస్తే ఆరు రోజులు ఆసుపత్రిలో ఉండే ఆయన పక్క రాష్ట్రం నుంచి వచ్చి నీతులు చెబితే వినే స్థితిలో తాము లేమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని