Balineni Srinivasa Reddy: రాజీనామాపై తగ్గేది లేదు

వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త పదవికి తాను చేసిన రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Updated : 03 May 2023 08:13 IST

పార్టీ పదవి విషయంలో సీఎం జగన్‌కు తేల్చిచెప్పిన బాలినేని
కొనసాగాలని ముఖ్యమంత్రి చెప్పినా కాదన్న మాజీ మంత్రి

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త పదవికి తాను చేసిన రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ సర్దిచెప్పినా ఆయన ససేమిరా అన్నారు. ‘నియోజకవర్గంలో మీకేం కావాలో చెప్పండి.. పార్టీపరంగా, ప్రభుత్వపరంగా ఏ సహకారం కావాలి? రాజీనామాను ఉపసంహరించుకుని ప్రాంతీయ సమన్వయకర్తగా కొనసాగండి’ అని సీఎం చెప్పినా బాలినేని మెత్తబడలేదని తెలిసింది. ఆయన ముఖ్యమంత్రిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిశారు. 40 నిమిషాలకు పైగా కొనసాగిన ఈ భేటీలో రాజీనామా ఉపసంహరణ తప్ప ఇంకేదైనా చెప్పాలని బాలినేని అన్నట్లు సమాచారం. ‘ఒంగోలుపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలి. అనారోగ్యం వల్ల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతను నిర్వర్తించడం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి నా నియోజకవర్గానికే పరిమితమవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని సీఎంకు కచ్చితంగా చెప్పినట్లు తెలిసింది.  
ఇలా రాజీనామా చేస్తే పార్టీ కేడర్‌కు వేరే సంకేతాలు వెళ్తాయని.. రాజీనామాను ఉపసంహరించుకోవాలని సీఎం చెప్పినా బాలినేని తగ్గలేదని సమాచారం. వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐ-ప్యాక్‌ సంస్థ ప్రతినిధి రిషిరాజ్‌ క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో పార్టీలో ఉన్న గ్రూపులు, వాటిని సర్దుబాటు చేసేందుకు బాలినేని అవసరం ఎంత ఉందనే విషయంపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిసింది. అయినా తాను మాత్రం ఒంగోలుకే పరిమితం కావాలని అనుకుంటున్నట్లు బాలినేని తెగేసి చెప్పారని సమాచారం.

ఇదేం అవమానం: సీఎం పిలుపుతో వచ్చిన బాలినేని.. తొలుత సీఎంఓలోని ఒక కీలక అధికారి, ఐ-ప్యాక్‌ ప్రతినిధితో మాట్లాడారు. ‘గతేడాది నన్ను మంత్రివర్గం నుంచి తప్పించినప్పుడు ఏం చెప్పారు? మంత్రివర్గంలో లేకపోయినా జిల్లాలో మీరే మంత్రి, మీకు ఆ గౌరవం ఉంటుందన్నారు. కానీ జరుగుతున్నదేంటి? కనీసం నేను అడిగిన డీఎస్పీని కూడా ఎందుకు ఇవ్వలేదు’ అని బాలినేని ప్రశ్నించినట్లు తెలిసింది. ‘ఇప్పుడు ఇచ్చిన డీఎస్పీ మీ మాట వింటారని సమాచారం ఉంది, అందుకే వేశాం’ అని ఆ అధికారి చెప్పగా.. ‘నేను అడిగిన వాళ్లను కాదని మీరు వేసిన వ్యక్తి నా మాట ఎలా వింటారు’ అని బాలినేని చికాకు పడినట్లు సమాచారం. తర్వాత వారు ఆయన్ను సీఎం వద్దకు తీసుకువెళ్లారు. ‘వాసన్నా.. కో ఆర్డినేటర్‌గా కంటిన్యూ కావాలి’ అని సీఎం అనగా, ‘లేదు, నేను ఉండలేను’ అని బాలినేని చెప్పారు. బాలినేని తిరిగి వెళ్లేటప్పుడు మీడియా పాయింట్‌ ఉన్న వైపు కాకుండా మరో దారిలో వెళ్లిపోయారు.

అప్పటినుంచి అసంతృప్తి: గతేడాది మంత్రివర్గం నుంచి తప్పించిన తర్వాత బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. మొదటి మంత్రివర్గంలో ఆయన సామాజికవర్గానికి చెందిన మంత్రులు నలుగురు ఉండేవారు. గౌతమ్‌రెడ్డి మృతిచెందగా, మిగిలిన ఇద్దరినీ కొనసాగించి తననే తప్పించారని బాలినేని అసహనంతోనే ఉంటున్నారు. తనను కాదని ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్‌ను కొనసాగించడం పుండుమీద కారం చల్లినట్లుగా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి ఆ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు మంత్రి సురేష్‌ను ఆయన వద్దకు అనుమతించి, బాలినేనిని మాత్రం అధికారులు అనుమతించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దాన్ని తీవ్ర అవమానంగా భావించిన బాలినేని.. సీఎంను కలవకుండానే వెనుదిరిగి వెళ్లిపోగా, తర్వాత విషయం తెలిసి ఆయన్ను సీఎం పిలిపించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే బాలినేని పార్టీ పదవికి రాజీనామా చేశారంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని