Nara Lokesh: దళితులపై ప్రభుత్వ దమనకాండ

రాష్ట్రంలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Updated : 04 May 2023 06:13 IST

అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు
‘ఎస్సీలతో ముఖాముఖి’లో లోకేశ్‌

ఈనాడు, కర్నూలు: రాష్ట్రంలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్ర సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం వెంకటగిరిలో బుధవారం ఆయన ‘ఎస్సీలతో ముఖాముఖి’ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దళితుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. దళితుల ఉపప్రణాళిక నిధులు రూ.వేల కోట్లు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బాధిత దళితులకు మద్దతుగా పోరాడుతున్న దళితులపైనే  ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రశ్నించినా, పోరాడినా అడ్డగోలుగా కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు. దళితుల భూములను వైకాపా నేతలు లాక్కుంటున్నారని ఆరోపించారు. తెదేపా హయాంలో భూమిని కొనుగోలు చేసి దళితులకు పంపిణీ చేశామని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఏటా దళితులకు భూపంపిణీ చేస్తామని హామీనిచ్చారు.

జగన్‌ పాలనలో ఎన్నో దారుణాలు

‘జగన్‌ పాలనలో కొందరు దళితులనూ చంపేశారు. అనంతబాబు తన దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం శవాన్ని డోర్‌ డెలివరీ చేశారు’ అని లోకేశ్‌ ఆరోపించారు. ఇన్ని దారుణాలు కనిపిస్తున్నప్పటికీ మంత్రి సురేష్‌ చొక్కా విప్పి జగన్‌ ముందు ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. తనను అడ్డుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యే సుధాకర్‌ జగన్‌ను ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. తెదేపా అధికారంలోకి వచ్చాక సుప్రీం తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని హామీనిచ్చారు. అప్పటివరకు దామాషా ప్రకారం నిధుల కేటాయిస్తామన్నారు.

తెదేపా హయాంలోనే దళితవాడల ప్రగతి

రాష్ట్రవ్యాప్తంగా దళితవాడల అభివృద్ధి తెదేపా హయాంలోనే జరిగిందని లోకేశ్‌ గుర్తు చేశారు. దళితుడైన బాలయోగి లోగడ లోక్‌సభ స్పీకర్‌ అయ్యారని వివరించారు. ఇద్దరు మాదిగలకు ఎమ్మెల్సీ పదవులిచ్చామని, వర్ల రామయ్యకు ఎంపీ టిక్కెట్‌ ఇచ్చామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులను సమీక్షించి దళితులపై అరాచకాలకు పాల్పడినవారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతామని హామీనిచ్చారు. వైకాపా పాలనలో దళిత ఎమ్మెల్యేలున్న చోట వైకాపా నేతల పెత్తనమే సాగుతోందని, కోడుమూరు నియోజకవర్గమే దీనికి నిదర్శనమని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని