Rahul Gandhi: బెంగళూరు వీధుల్లో రాహుల్‌ సందడి

కర్ణాటక విధానసభ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆదివారం రోడ్‌షో, ప్రచార సభలను కొనసాగించారు.

Updated : 08 May 2023 09:32 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: కర్ణాటక విధానసభ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆదివారం రోడ్‌షో, ప్రచార సభలను కొనసాగించారు. భోజన విరామ సమయంలో ఎంజీ రోడ్డు సమీపంలోని ఎయిర్‌లైన్స్‌ హోటల్‌కు చేరుకున్నారు. ఆహారం, నిత్యావసరాలను అందజేసే వివిధ కంపెనీల డెలివరీ బాయ్‌లతో ఆయన మాట్లాడుతూ మసాలా దోసెను ఆరగించారు. కాఫీ తాగుతూ నిత్యావసరాల ధరల పెరుగుదలపై చర్చించారు. స్థిరమైన ఉపాధి లేకపోవడంతో తాము డెలివరీ బాయ్‌లుగా పనిచేస్తున్నామని పలువురు ఆయనకు వివరించారు. బెంగళూరులోనే సుమారు రెండు లక్షలకు పైగా డెలవరీ బాయ్‌లు ఉన్నారు. కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇటువంటి కార్మికుల సంక్షేమానికి రూ.3 వేల కోట్ల నిధులను కేటాయిస్తామని రాహుల్‌ ఈ సందర్భంగా తెలిపారు. అసంఘటిత కార్మికులకు పనిగంటలు, కనీస వేతన చట్టాలకు అనుగుణంగా వేతనాలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఓ డెలివరీ బాయ్‌ ద్విచక్ర వాహనంపై హోటల్‌ సమీపంలోని వీధుల్లో కాసేపు తిరిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని