YSRCP: ఇన్‌ఛార్జులను ప్రకటించిన వైవీ సుబ్బారెడ్డి.. పంతం పట్టి పేర్లు మార్చిన విజయసాయిరెడ్డి

విశాఖలో అధికార వైకాపాలో ఆధిపత్య పోరు రగులుతోంది. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఇన్‌ఛార్జ్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య పోటీ తారస్థాయికి చేరింది.

Updated : 13 May 2023 07:48 IST

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో అధికార వైకాపాలో ఆధిపత్య పోరు రగులుతోంది. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఇన్‌ఛార్జ్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య పోటీ తారస్థాయికి చేరింది. తాజాగా జరిగిన జోనల్‌ ఇన్‌ఛార్జుల నియామకమే ఇందుకు తార్కాణంగా కనిపిస్తోంది. పార్టీ నేతలతో వైవీ సుబ్బారెడ్డి చర్చించి నిర్ణయించిన వారిని నియమిస్తూ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసిన ఒక్కరోజులోనే... ఆ పేర్లను మార్చి వేరేవారికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో పార్టీ అనుబంధ విభాగాల (విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలు) జోనల్‌ ఇన్‌ఛార్జుల నియామకంపై కసరత్తు చేశారు. యువజన విభాగం ఇన్‌ఛార్జిగా సునీల్‌కుమార్‌, మహిళా విభాగం ఇన్‌ఛార్జిగా విశాఖ నగర మహిళా విభాగ మాజీ అధ్యక్షురాలు గరికన గౌరి పేర్లు తెరపైకి తెచ్చారు. అప్పట్లో వీరి ఎంపికపై పార్టీలోని కొందరి నుంచి వ్యతిరేకత రావడంతో జోనల్‌ ఇన్‌ఛార్జుల నియామకాన్ని కొన్నిరోజులు పక్కనపెట్టారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్జిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి యువజన విభాగానికి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమారుడు ముత్తంశెట్టి వెంకట శివసాయి సందీప్‌, మహిళా విభాగానికి విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మిల పేర్లు ఖరారు చేశారు. ఈ పేర్లను పార్టీ కేంద్ర కార్యాలయం ఈ నెల 10న తాడేపల్లి నుంచి ప్రకటించింది.

సవాల్‌ చేసి.. మరీ మార్పు!

ఈ నెల 6న విశాఖ విమానాశ్రయానికి విజయసాయిరెడ్డి వచ్చినప్పుడు జోనల్‌ ఇన్‌ఛార్జుల పేర్లు మార్చుతున్నారనే అంశాన్ని కొందరు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ‘నేను సూచించిన వారికి కాకుండా వేరేవారికి ఎలా వస్తాయో చూస్తా’ అంటూ విజయసాయి పార్టీ నాయకుల వద్ద సవాల్‌ చేసినట్లు సమాచారం. సుబ్బారెడ్డి నిర్ణయించిన పేర్లతో  లేఖ విడుదలవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. 10న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని, వారి స్థానంలో సునీల్‌కుమార్‌, గరికన గౌరిలను నియమించినట్లు పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా ఆయనే ప్రకటన చేశారు.  ఎంపీ పంతం నెగ్గించుకోవడంతో పార్టీ కార్యకర్తలు సందిగ్ధంలో పడ్డారని సమాచారం. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమారుణ్ని యువజన విభాగం ఇన్‌ఛార్జిగా నియమించినా.. ఒక్క రోజుకే తొలగించడాన్ని ఆయన వర్గీయులు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని