కాంగ్రెస్‌కు 50 స్థానాలకూ అభ్యర్థులు లేరు

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు 50 స్థానాలకు కూడా అభ్యర్థులు లేరని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 28 May 2023 06:35 IST

అభివృద్ధిపై తప్పుడు ప్రచారంతో విపక్షాలు విషం చిమ్ముతున్నాయి
జడ్చర్ల సభలో మంత్రి హరీశ్‌రావు

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు 50 స్థానాలకు కూడా అభ్యర్థులు లేరని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారా? అని ఎదురుచూసే పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ పగటి కలలు కంటోందన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో రూ.24.35 కోట్లతో నిర్మించిన వంద పడకల ఆసుపత్రి భవనాన్ని శనివారం ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పట్టణంలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని.. 9 ఏళ్లలో భారాస ప్రభుత్వం చేసి చూపెట్టింది. అయినా తప్పుడు ప్రచారంతో ప్రతిపక్షాలు విషం చిమ్ముతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఇటీవల జడ్చర్లకు వచ్చి తెలంగాణలో నిరుద్యోగం ఉందని మాట్లాడారు. సీఎంస్థాయి వ్యక్తి మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి ఎంతోమంది పొట్ట చేతపట్టుకుని పనుల కోసం తెలంగాణకు వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల కంటే ప్రమాదకరంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. తెలంగాణను తెచ్చింది.. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది.. హక్కుల కోసం దిల్లీలో పోరాడుతున్నది భారాసనే. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం జరుపుతుంటే కాంగ్రెస్‌ అడ్డుపడుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీ కలిసిరాలేదు.ఇప్పుడు అభివృద్ధిలోనూ కలిసి రావడంలేదు. కాంగ్రెస్‌ హయాంలోనే పాలమూరులో వలసలున్నాయి. కేసీఆర్‌ సీఎం అయ్యాక.. ఆ పరిస్థితి తారుమారై ఇక్కడికే వలస వస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రతి సమావేశంలో కులాలను దూషిస్తున్నారన్నారు. ‘పాలమూరు నుంచి ఎందరో నేతలు నైతిక విలువలతో రాజకీయాల్లో ఉన్నారు. ఈ జిల్లా నుంచి వచ్చిన రేవంత్‌ నైతిక విలువలను నేర్చుకోవాలి. ప్రతిపక్ష పార్టీలు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. దేశంలో 96 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైతే.. కేవలం తెలంగాణలోనే 56 లక్షల ఎకరాలు సాగైంది. వచ్చే ఎన్నికల్లో భారాస గెలిచి, మూడోసారి సీఎంగా కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేస్తారు’’ అని పేర్కొన్నారు.  మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని