ఏం సాధించారని సంబరాలు?

పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధించిందని సంబరాలు చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు.

Published : 28 May 2023 06:34 IST

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధించిందని సంబరాలు చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై శనివారం హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. భారాస ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, రైతులకు అన్యాయం జరిగిందని దుయ్యబట్టారు. ‘‘రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌ పేరుతో ఆర్‌ఓఆర్‌ చట్టంలో అనుభవదారు కాలం తొలగించి రైతుల హక్కులను కాలరాశారు. రైతుబంధు పేరిట భూస్వాములకు నిధులు దోచిపెట్టారు. హోంగార్డుల సర్వీసులను క్రమబద్ధీకరించి, అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలి. ఇప్పటి వరకు ఎన్ని వేల ఎకరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కేటాయించిందో ప్రభుత్వం ప్రకటించాలి. ఆదివాసీ, గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. సాంస్కృతిక సారథి పేరిట కవులు, కళాకారులు, రచయితలు కేసీఆర్‌ చేతిలో బందీలుగా మారారు. టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేసిన తర్వాతనే గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలి’’ అని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధులు డా.వెంకటేశ్‌ చౌహాన్‌, కొంగరి అరుణ క్వీన్‌, సాంబశివగౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని