తెదేపా కార్యకర్తలకు ఆరోగ్యసాయం

తెదేపా కార్యకర్తలకు ఆసుపత్రిలో చికిత్స సమయంలో నేరుగా సాయం చేసే వ్యవస్థను తెచ్చే ఆలోచన చేస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు.

Published : 28 May 2023 06:19 IST

కార్యకర్తల సంక్షేమంపై తీర్మానంలో చంద్రబాబు

ఈనాడు, అమరావతి: తెదేపా కార్యకర్తలకు ఆసుపత్రిలో చికిత్స సమయంలో నేరుగా సాయం చేసే వ్యవస్థను తెచ్చే ఆలోచన చేస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. ‘పార్టీని వెన్నంటి ఉంటూ కష్టించి పనిచేసే కార్యకర్తలకు ఎంత చేసినా తక్కువే.. వారిని అన్ని విధాలా ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు. మహానాడులో శనివారం ఆయన కార్యకర్తల సంక్షేమం తీర్మానంపై చర్చలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెదేపా నాయకుడు శిష్లా లోహిత్‌ కార్యకర్తల సంక్షేమానికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. వివిధ కారణాలతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ బీమా సౌకర్యం కల్పించి రూ.100 కోట్ల వరకు అందించారని, దీన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. తెదేపా కార్యకర్తల ఆరోగ్యం బాగా లేకున్నా వారి బాధ్యతను పార్టీ తీసుకుంటుందని మాజీమంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలను అమలుచేస్తామని తెదేపా నాయకుడు శిష్లా లోహిత్‌ వివరించారు.


చంద్రబాబే మహాశక్తి

- వర్ల రామయ్య, పొలిట్‌బ్యూరో సభ్యుడు

మన రాజకీయ ప్రత్యర్థి జిత్తులమారి. అవినీతి సంపాదనతో ఎదిగిన జగన్‌ను ఎదుర్కొనే మహాశక్తి తెదేపా అధినేత చంద్రబాబు మాత్రమే. ఆయనకు మనమంతా అండగా నిలవాలి. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడదాం. రాక్షస పాలనకు స్వస్తి పలుకుదాం. అధినేతపైనా, నేతలపైనా ప్రభుత్వం అడుగడుగునా తప్పుడు కేసులు పెడుతూ, నిర్బంధిస్తూ పార్టీని దెబ్బతీయాలని చూసింది. వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని హేళన చేసింది. శాంతిభద్రతల్ని కాపాడాల్సిన పోలీసువ్యవస్థ నిర్వీర్యమైంది. మన అధినేత మొక్కవోని ధైర్యంతో అరాచక ప్రభుత్వాన్ని ఎదిరించి కార్యకర్తల్లో మనోధైర్యం నింపారు. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంతో అధిక ధరలపై పోరాడి, ప్రభుత్వాన్ని నేలపైకి తెచ్చారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజల ముందుంచేందుకు ‘ఇదేంఖర్మ మన రాష్ట్రానికి’ పేరుతో పార్టీని నడిపించారు. లోకేశ్‌ యువగళం పాదయాత్ర... అధికార పార్టీ గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. దురదృష్ట కారణాలతో తెలంగాణలో పార్టీ ఓడినా సరే, అక్కడి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు