అభివృద్ధికి చిరునామా చంద్రబాబు

ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేశారని, అభివృద్ధికి ఆయన చిరునామాగా నిలిచారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు కొనియాడారు.

Published : 30 May 2023 05:48 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేశారని, అభివృద్ధికి ఆయన చిరునామాగా నిలిచారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు కొనియాడారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగు కీలకాంశాలతో మహానాడులో ప్రవేశపెట్టిన తొలి మేనిఫెస్టోను చూసిన మహిళలు, యువత ఒక్క ఓటు తప్పిపోకుండా తెదేపాకు వేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. చంద్రబాబు చేస్తానంటోంది నిజమైన సంక్షేమమని పేర్కొన్నారు. ‘తెదేపా మేనిఫెస్టో చూసిన తర్వాత మా పార్టీ కొంతమందిని రంగంలోకి దింపి విమర్శలు గుప్పించడం హాస్యాస్పదంగా ఉంది. మహానాడుకు తెదేపా శ్రేణులు వెళ్లకుండా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా లక్షలాది మంది తరలివచ్చారు. వారందరిని చూస్తే మా పార్టీ ప్రభుత్వానికి మృత్యుఘంటికలు మోగుతున్నాయన్నది స్పష్టమవుతోంది. సంక్షేమం పేరిట మా పార్టీ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేసింది...’ అని పేర్కొన్నారు. పరిశ్రమల్లో వాటాలు అడుగుతూ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వ పెద్దలు తరిమికొట్టారని, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు సొమ్ము చేసుకుంటున్నారని రఘురామ ఆరోపించారు. ఓటుకు నోటు కేసు అభియోగపత్రంలో చంద్రబాబు నాయుడు పేరు లేకపోయినా ఆయన రాజీనామాకు జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారని... ప్రస్తుతం వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు అభియోగపత్రంలో తన పేరు వచ్చినా జగన్‌మోహన్‌రెడ్డి కనీసం సంజాయిషీ ఇవ్వడం లేదన్నారు. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని రఘురామ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని