ప్రజా సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ప్రజల సంక్షేమమే.. భారాస కార్యకర్తల లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Published : 31 May 2023 02:57 IST

మామిడిపల్లి (మాక్లూర్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: తెలంగాణ ప్రజల సంక్షేమమే.. భారాస కార్యకర్తల లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం మామిడిపల్లిలో మంగళవారం నిర్వహించిన ‘భారాస ఆత్మీయ సమ్మేళనం’లో ఆమె మాట్లాడారు. ఒకప్పుడు ఇదేం పార్టీ అని అవహేళన చేశారని.. కానీ, ఇప్పుడు అదే గులాబీ పార్టీ ప్రభుత్వం ఇంటింటికీ మూడు సంక్షేమ పథకాలు అందించే స్థాయికి ఎదిగిందన్నారు. ఇదంతా భారాస కార్యకర్తల త్యాగం వల్లే సాధ్యమైందని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు ఎవరూ చేయని మంచి పనులను సీఎం కేసీఆర్‌ చేసి చూపించారని.. అభివృద్ధిని, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. భారాస కేవలం రాజకీయ పార్టీయే కాదని.. ఎంతో కష్టంతో, కోపంతో, ఆవేదనతో, ప్రేమతో పుట్టుకొచ్చిన పార్టీ అని పేర్కొన్నారు. బీడీ కార్మికుల కోసం స్థానికంగా ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మించాలని కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి మంజూరు చేయడంతోపాటు భవన నిర్మాణ కార్మికుల సంఘానికి కొత్త భవనం నిర్మిస్తామని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కవితను భారీ ఆధిక్యంతో గెలిపించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నిజామాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు