ప్రశ్నిస్తే నోటీసుల పేరిట బెదిరింపులా?

ప్రశ్నించే పార్టీలను లీగల్‌ నోటీసుల పేరిట బెదిరించడం సరికాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

Published : 31 May 2023 03:49 IST

ఓఆర్‌ఆర్‌ టెండర్లపై విచారణ చేపట్టాల్సిందే
సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రశ్నించే పార్టీలను లీగల్‌ నోటీసుల పేరిట బెదిరించడం సరికాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు టెండరు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, వాటిపై సమగ్ర విచారణ చేపట్టడంతోపాటు వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్‌ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ‘‘ఓఆర్‌ఆర్‌ టోల్‌ టెండరు వ్యవహారంపై వాస్తవాలను బహిర్గతం చేయాలి. ఈ టెండరు అప్పగింత అంశంలో అవినీతి ఆరోపణలపై ప్రజలకు సీఎం సమాధానం చెప్పాల్సిన అవసరముంది. ముప్పై ఏళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.30 వేల కోట్ల ఆదాయమిచ్చే ప్రాజెక్టును అతి తక్కువ మొత్తానికి ప్రైవేటు సంస్థకు అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో వివరించాలి. ఈ టెండరు అంశంలో ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోందో వెల్లడించాలి. టెండరుకు మార్గదర్శకాల రూపకల్పన, నోటిఫికేషన్‌ జారీ, ఖరారు వరకు రాష్ట్ర ప్రభుత్వం అంతా రహస్యంగానే ఉంచింది. బేస్‌ ప్రైస్‌ ఎంత మొత్తమనే అంశాన్నీ చెప్పడంలేదు. టెండరు దక్కించుకున్న ఐఆర్‌బీ సంస్థే మహారాష్ట్రలోని ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌ ప్రాజెక్టును పదేళ్లకు రూ.8,875 కోట్ల లీజుకు తీసుకుంది. దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం టెండరు ద్వారా అప్పగించినప్పుడు... అంతకంటే ఎక్కువ కాలానికి, ఎక్కువ దూరం ఉన్న ఓఆర్‌ఆర్‌ను తక్కువ మొత్తానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది’’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని