దేవినేని ఉమా వైకాపాకు అనుకూల శత్రువు: వసంత కృష్ణప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీ మంత్రి దేవినేని ఉమా ఎన్టీఆర్‌ జిల్లాలో వైకాపాకు అనుకూల శత్రువని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 31 May 2023 08:52 IST

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి దేవినేని ఉమా ఎన్టీఆర్‌ జిల్లాలో వైకాపాకు అనుకూల శత్రువని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో ఆయన మాట్లాడారు. దేవినేని ఉమా గతంలో గ్రావెల్‌, ఇసుక అక్రమంగా దోచుకుని ఎదిగారన్నారు. ఒక్కసారి గెలిచిన కృష్ణప్రసాద్‌కు ఇంత బలుపా అంటున్నారని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమాపై 13 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గినందుకు తనకు బలుపేనన్నారు. ఉమా వ్యవహారశైలితోనే తెదేపా నుంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నాయకులు వైకాపాలో చేరారని, ఉమా ఎక్కడికి వెళ్లినా అక్కడ తెదేపాకు 500 ఓట్లు తగ్గుతాయని ఎద్దేవా చేశారు. నందిగామలో ఉమా ప్రచారం చేస్తే రెండోసారి కూడా జగన్మోహనరావు ఎమ్మెల్యేగా గెలుస్తారని అన్నారు. 

కేశినేని వస్తే ఆహ్వానిస్తాం: అయోధ్యరామిరెడ్డి

విజయవాడ ఎంపీ కేశినేని నాని వైకాపాలోకి వస్తే ఆహ్వానిస్తామని విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకు ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి బదులిచ్చారు. 30 మంది అధికారపక్ష ఎమ్మెల్యేలు తెదేపాతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీవారు అంటున్నారని అడగగా.. అదంతా ప్రతిపక్షాల మైండ్‌ గేమ్‌ అని కొట్టిపారేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని