ఎమ్మెల్యే ఆర్థర్‌ను నిలదీసిన గుడిపాడు రైతులు

‘మా ప్రాంతంలో మల్లికార్జున స్వామి ప్రాజెక్టు నిర్మిస్తామంటున్నారు. ప్రాజెక్టు వస్తుందన్న ప్రకటనలతో మా పొలాలు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు’ అని నంద్యాల జిల్లా మిడుతూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 31 May 2023 04:55 IST

మిడుతూరు, న్యూస్‌టుడే: ‘మా ప్రాంతంలో మల్లికార్జున స్వామి ప్రాజెక్టు నిర్మిస్తామంటున్నారు. ప్రాజెక్టు వస్తుందన్న ప్రకటనలతో మా పొలాలు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు’ అని నంద్యాల జిల్లా మిడుతూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుపై స్పష్టతివ్వాలంటూ నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్‌ను నిలదీశారు. మండలంలోని చౌట్కూరు మజరా గ్రామమైన గుడిపాడు, 49 బన్నూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆర్థర్‌ మంగళవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మల్లికార్జునస్వామి ప్రాజెక్టు వద్దని ఎమ్మెల్యేకి చెప్పారు.  ఆర్థర్‌ మాట్లాడుతూ.. ప్రాజెక్టుపై ఇంకా స్పష్టత లేదని చెప్పగా.. సాక్షి పత్రికలో ప్రాజెక్టు పూర్తి సమాచారం వచ్చింది కదా అని రైతులు నిలదీశారు. పత్రికాముఖంగానే దీనిని ఖండించాలంటూ పట్టుబట్టారు. మీరు వద్దంటే ప్రాజెక్టు రాదని, పదిరోజుల తర్వాత కలెక్టర్‌ వద్దకు వెళదాం.. అంతవరకు నాకు సమయమివ్వండి అంటూ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘సార్‌ నేను వైకాపా కార్యకర్తను. పార్టీ కోసం, మీ విజయం కోసం కష్టపడ్డా. గ్రామంలో రూ.5 లక్షలు పైగా ఖర్చుచేసి అభివృద్ధి పనులు చేశా. ఒక్క రూపాయీ రాలేదు. బిల్లులు రాకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిందే’ అంటూ అంతకు ముందు వైకాపా కార్యకర్త రాము ఎమ్మెల్యే వద్ద ఆవేదన ఏకరువు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని