తెదేపా మేనిఫెస్టోతో వైకాపా నేతలు గింగిరాలు

మహానాడులో తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోతో వైకాపా నేతలు గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేశ్‌పై మంత్రులు పిచ్చి వాగుడు వాగుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.

Published : 31 May 2023 04:55 IST

ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

ఈనాడు, అమరావతి: మహానాడులో తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోతో వైకాపా నేతలు గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేశ్‌పై మంత్రులు పిచ్చి వాగుడు వాగుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. తమ శాఖలు సక్రమంగా వెలగబెట్టలేని మంత్రులు చంద్రబాబుపై పడి ఏడవడం సిగ్గు చేటన్నారు. రాబోయే ఎన్నికలతో వైకాపా దుకాణం మూసేసుకోవడం ఖాయమని చెప్పారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘తన పని సక్రమంగా చేయలేని కారుమూరి నాగేశ్వరరావు... పోలవరం డీపీఆర్‌ ఆమోదించడం చేతకాని, నిర్వాసితులకు ఇళ్లు కట్టలేని అంబటి రాంబాబు... దేవుడి మాన్యాలు కాపాడలేని, అమరావతిలో వెంకన్న ఆలయానికి భూమిని కుదించిన కొట్టు సత్యనారాయణ... చంద్రబాబు కట్టిన ఇళ్లను కూడా పేదలకు పంచలేని జోగి రమేశ్‌... వ్యవసాయం కన్నా కోర్టు ఫైళ్ల మాయంపై ఎంతో అవగాహన ఉన్న కాకాణి...  పెద్దిరెడ్డి ముందు కుర్చీలో కూడా కూర్చోలేని డిప్యూటీ సీఎం నారాయణస్వామి... వీరిలో ఎవరికైనా చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా?...’ అని అనురాధ నిలదీశారు. ‘మా మేనిఫెస్టో పేదల గుండెల్లో ఉంది. అందుకే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు...’ అని ఎమ్మెల్సీ అనురాధ పేర్కొన్నారు.


అసలు సినిమా చూస్తే సర్దుకోవాలసిందే

- ధూళిపాళ్ల 

మహానాడులో తెదేపా విడుదల చేసిన మేనిఫెస్టో టీజర్‌పై 15 మంది మంత్రులు నోటికి పని చెప్పడం ప్రభుత్వ పాలకుల భయానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ అన్నారు. కేవలం టీజర్‌కే వైకాపా ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని, అసలు సినిమా చూస్తే జగన్‌మోహన్‌రెడ్డితో సహా అంతా పెట్టె బేడా సర్దుకోవాలసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘మినీ మేనిఫెస్టోపై మంత్రులు ఎందుకిలా పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు? వారి రాజకీయ జీవితం ముగిసిపోయేలా చంద్రబాబు విడుదల చేసిన టీజర్‌ ఉందనా? జగన్‌రెడ్డి అరాచకానికి, విధ్వంసానికి ప్రజలు ముగింపు పలికే రోజులు దగ్గర పడ్డాయి...’ అని  పేర్కొన్నారు. ‘చంద్రబాబుకి భద్రత ఎందుకంటున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. పోలీసుల భద్రత లేకుండా ఒక్క రోజు ప్రజల్లోకి వెళ్లగలరా? దొంగ సర్టిఫికేట్లు, దొంగ డిగ్రీలతో స్పీకర్‌ స్థానం పరువు తీసిన వ్యక్తిగా చరిత్రలో తమ్మినేని నిలిచిపోతారు...’ అని నరేంద్రకుమార్‌ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని