గెలిచే వారికే టికెట్‌!

సీనియర్లు, జూనియర్లు అనే దాంతో సంబంధం లేకుండా పార్టీ విజయావకాశాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే టికెట్లు కేటాయించాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ ఉంది.

Published : 01 Jun 2023 04:39 IST

సీనియర్‌ నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం
విజయావకాశాలే లక్ష్యంగా  కొత్త ముఖాలు తెరపైకి
అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్‌ వ్యూహమిది

ఈనాడు, హైదరాబాద్‌: సీనియర్లు, జూనియర్లు అనే దాంతో సంబంధం లేకుండా పార్టీ విజయావకాశాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే టికెట్లు కేటాయించాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడం సాధ్యం కాదంటూ ఇప్పటికే కొందరు సీనియర్లకు చెప్పినట్లు సమాచారం. ‘పార్టీలో మీకు తగిన గౌరవం ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశాలుంటాయి. కాబట్టి ముందుగానే టికెట్‌ కోసం పోటీపడి ఇబ్బంది పెట్టవద్దంటూ’ వారికి నచ్చజెబుతున్నట్లు తెలిసింది. ‘కొందరు పార్టీలో పెద్ద నాయకులైనప్పటికీ వరుసగా ఓడిపోవడమే కాకుండా, అక్కడ ఓట్ల తేడా కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. మళ్లీ పోటీ చేసినా ఇదే పరిస్థితి. కొందరు ఎన్నికలప్పుడు మాత్రమే నియోజకవర్గంలో పర్యటిస్తారు. వీరికి మళ్లీ టికెట్‌ ఇచ్చినా పాత పరిస్థితే పునరావృతమవుతుంది. కొన్నిచోట్ల ఇద్దరు బలమైన అభ్యర్థులున్నారు. వారి మధ్య విబేధాల వల్ల గతంలో వ్యతిరేక ఫలితాలొచ్చాయి. ఇప్పుడు ఇద్దరితో చర్చించి ఓ అవగాహనకు రావడం ద్వారా రానున్న ఎన్నికల్లో విజయావకాశాలను మెరుగుపరుచుకోవాలని యోచిస్తున్నట్లు’ కాంగ్రెస్‌ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

ప్రత్యామ్నాయంపై కసరత్తు

ఇప్పటికే చాలా వరకు నియోజకవర్గాలకు సంబంధించి ఇలాంటి కసరత్తును పూర్తి చేసినట్లు సమాచారం. ఎక్కువ చోట్ల కొత్త అభ్యర్థులకే ప్రాధాన్యమిచ్చే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో సమస్యలున్న నియోజకవర్గాలపై దృష్టి సారించినట్లు సమాచారం. పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు నివేదికలు, పార్టీలోని ముఖ్య నాయకులకు ఉన్న అవగాహన ఆధారంగా ఎక్కడెక్కడ ప్రత్యామ్నాయం అవసరం అన్నదానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలను పరిశీలిస్తే.. కొన్ని నియోజవర్గాల్లో ఓట్ల తేడా 50 వేలకు పైగా ఉంది. ఇలాంటిచోట్ల మళ్లీ పాతవారినే రంగంలోకి దించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ ముఖ్య నాయకుడొకరు ప్రశ్నించారు. నియోజకవర్గాల వారీగా తరచూ సర్వేలు చేయడం, అభ్యర్థి విషయమై.. ఓ నిర్ణయానికి రావడం, అక్కడ సీనియర్‌ నాయకులుంటే వారికి నచ్చజెప్పడం.. ఇలా కసరత్తు సాగుతుందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

ఇలా కొన్ని..

* పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారు. రవి గతంలో వరుసగా జడ్చర్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల వ్యత్యాసం కూడా ఎక్కువగా ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడం వీలు కాకపోవచ్చని ఆయనకు ఇప్పటికే చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక్కడ ఎర్రశేఖర్‌, అనిరుధ్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

* కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడో స్థానం లభించింది. ఇక్కడ అధికార పార్టీ తరఫున గంగుల కమలాకర్‌ గెలుపొందగా, భాజపాకు రెండో స్థానం, కాంగ్రెస్‌కు మూడో స్థానం లభించడంతో పాటు ఓట్లు కూడా చాలా తక్కువగా వచ్చాయి. అంతకు ముందు 2014లో కూడా ఇక్కడ కాంగ్రెస్‌ మూడో స్థానానికే పరిమితమైంది. కానీ రెండో స్థానంలో నిలిచిన భాజపాకు, కాంగ్రెస్‌కు ఓట్ల తేడా స్వల్పమే. 2018లో మాత్రం రెండు, మూడు స్థానాల మధ్య ఓట్ల శాతం ఎక్కువగా ఉంది. ఇక్కడ వరుసగా మూడుసార్లు భారాసయే గెలుపొందింది. ఇలాంటి చోట కొత్త అభ్యర్థుల కోసం కాంగ్రెస్‌ అన్వేషిస్తున్నట్లు తెలిసింది.

* జనగామ నుంచి సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య వరుసగా రెండుసార్లు ఓడిపోయారు. 2014 కంటే 2018లో ఓట్ల తేడా కూడా ఎక్కువ. ఇక్కడ ప్రస్తుతం పొన్నాలతో పాటు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి టికెట్‌ కోసం పోటీపడుతున్నారు. డీసీసీ అధ్యక్షుడి విషయంలో కూడా ఇక్కడ పేచీ ఉంది. ఈ నేపథ్యంలో విజయావకాశాలు మెరుగ్గా ఉన్న వారికే టికెట్‌ ఇవ్వడం, మిగిలిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం, అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ముందుగానే హామీ ఇచ్చి నచ్చజెప్పడం.. పార్టీ వ్యూహంగా ఉంది.

* సూర్యాపేట నియోజకవర్గంలో వరుసగా కాంగ్రెస్‌ ఓడిపోయింది. ఇక్కడ సీనియర్‌ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయన రెండో స్థానం సాధించగా.. భాజపా అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులకు ఓట్లలో బాగా తేడా ఉంది. అంతకుముందు 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంకినేని వెంకటేశ్వరరావు రెండో స్థానంలో నిలవగా, దామోదర్‌రెడ్డి మూడో స్థానంలో, తెలుగుదేశం నుంచి పోటీ చేసిన పటేల్‌ రమేష్‌రెడ్డి నాలుగోస్థానంలో నిలిచారు. అయితే గెలిచిన, ఓడిన అభ్యర్థులందరికీ కూడా ఓట్లలో తేడా తక్కువే. దామోదర్‌రెడ్డికి, పటేల్‌ రమేష్‌రెడ్డికి కూడా ఓట్ల తేడా రెండు వేలే. ప్రస్తుతం రమేష్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఇక్కడ కూడా ఇద్దరికీ అవగాహన కుదిర్చి ముందుకు వెళ్లాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఇలాగే మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అధ్యయనం సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని