తాగునీరు లేదు.. పట్టించుకునే వారూ లేరు

పది రోజులుగా తాగునీరు లేక కష్టాలు పడుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని మహిళలు మండిపడ్డారు. ఖాళీ బిందెలు, బకెట్లతో రహదారిపై బైఠాయించారు.

Published : 01 Jun 2023 04:52 IST

ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

దేవరపల్లి, న్యూస్‌టుడే: పది రోజులుగా తాగునీరు లేక కష్టాలు పడుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని మహిళలు మండిపడ్డారు. ఖాళీ బిందెలు, బకెట్లతో రహదారిపై బైఠాయించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం పంచాయతీ పరిధి కొండగూడెంలో సుమారు 500 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరందరూ కూలి చేసుకుని జీవనం సాగిస్తున్నారు. తాగునీరు రాకపోవడంతో బుధవారం సాయంత్రం కొవ్వూరు-గుండుగొలను ప్రధాన రహదారిపై సుమారు 100 మంది ఆందోళన చేపట్టారు. మూడ్రోజులుగా పంచాయతీ చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని, తాగునీరు ఇచ్చేవరకు కదిలేది లేదని భీష్మించారు. 3గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. సీఐ శ్రీనివాసరావు వచ్చి మహిళలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఘటన స్థలానికి వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావును మహిళలు నిలదీశారు. ‘ఎన్నికల సమయంలో వచ్చారు. గెలిచి నాలుగేళ్లు అయ్యింది. ఒక్క సమస్యా పరిష్కరించలేనప్పుడు మీరెందుకు’ అని ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చెప్పిన సమస్యలూ ఇప్పటిదాకా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి.. ట్యాంకు నిర్మాణానికి ప్రత్యేక నిధి నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని