12న భాజపా రివర్స్‌ రన్‌

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22వ తేదీ వరకు చేపట్టనున్న వివిధ కార్యక్రమాలకు పోటీ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు భాజపా ప్రకటించింది.

Updated : 03 Jun 2023 05:54 IST

22 వరకు ప్రభుత్వానికి సమాంతరంగా కార్యక్రమాలు: బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22వ తేదీ వరకు చేపట్టనున్న వివిధ కార్యక్రమాలకు పోటీ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు భాజపా ప్రకటించింది. భారాస ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమి లేదని పేర్కొంటూ సంబంధిత రంగాల్లో వాస్తవ పరిస్థితిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. ఇందుకోసం శుక్రవారం పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మొదటగా శనివారం రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుకు భిన్నంగా భారాస పాలనలో వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు, మీడియా సమావేశాలు చేపట్టాలన్నారు. 4న పోలీస్‌ వ్యవస్థ దుర్వినియోగం, రాష్ట్రంలో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు, 5న విద్యుత్‌రంగ సమస్యలు...విద్యుత్‌ ఛార్జీలపెంపుతో ప్రజలపై పడుతున్న భారం తదితర అంశాలపై కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇంకా పరిశ్రమల మూత, పారిశ్రామిక రంగం సంక్షోభం, కార్మికులు ఉపాధి కోల్పోవడం సహా కార్మికుల సమస్యలపై.. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో నిధుల దుర్వినియోగం.. చెరువుల ఆక్రమణలపై నిరసనలు తెలియజేస్తారు. 12న తెలంగాణరన్‌కు వ్యతిరేకంగా యువ, మహిళా మోర్చాల ఆధ్వర్యంలో రివర్స్‌ రన్‌ నిర్వహించాలని నిర్ణయించారు. 21 వరకు వివిధ కార్యక్రమాలతో పాటు ఈ నెల 22న ‘అమరుల యాదిలో’ పేరిట తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయంపై కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని