భారాస పాలన అంతమే లక్ష్యం

రాష్ట్రంలో భారాస పాలనను అంతం చేసేందుకు తాము చేసే పోరాటాలకు కలసిరావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కోరారు.

Published : 03 Jun 2023 04:41 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారాస పాలనను అంతం చేసేందుకు తాము చేసే పోరాటాలకు కలసిరావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కోరారు. మిలియన్‌ మార్చ్‌, సకలజనుల సమ్మె స్ఫూర్తితో ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పడేదాకా పోరాడతామన్నారు. ఉద్యమకారులంతా తెలంగాణ ఉద్యమాలను గుర్తుకు తెచ్చుకుని తోడ్పాటును అందించాలన్నారు. రామరాజ్య స్థాపనే లక్ష్యమని, ప్రజలకోసం కొట్లాడే భాజపా ప్రాణత్యాగాలకూ వెనుకాడదని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు భారాస కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంజయ్‌ మాట్లాడారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి రాష్ట్ర సాధనకు భాజపా చేసిన పోరాటాలు, అమరుల బలిదానాలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం 9 ఏళ్లలో రూ.4 లక్షల కోట్లను కేటాయించిందన్నారు. ‘‘నాలుగు కోట్ల మంది ప్రజల కోసం కేటాయించిన డబ్బులను నలుగురు దోచుకుంటున్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే సీఎం రావడంలేదు. రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తున్నాయి. తెలంగాణ బంగారమైతే రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్న ప్రజలు భాజపాను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారనడానికి దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్‌, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం’’ అని సంజయ్‌ తెలిపారు. కార్యక్రమంలో నేతలు ఎన్‌.ఇంద్రసేనారెడ్డి, జి.వివేక్‌, మర్రి శశిధర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని