రూ.15వేల కోట్లు పెట్టి పోలవరం పూర్తి చేయలేరా?: ఎంపీ రఘురామ

లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ అని గొప్పలుపోతున్న జగన్‌ ప్రభుత్వం రూ.15వేల కోట్లు ఖర్చు చేసి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదా అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

Updated : 03 Jun 2023 06:36 IST

ఈనాడు, దిల్లీ: లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ అని గొప్పలుపోతున్న జగన్‌ ప్రభుత్వం రూ.15వేల కోట్లు ఖర్చు చేసి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదా అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి రాష్ట్రం వద్ద డబ్బులు లేకపోతే...  అయ్యా! ప్రాజెక్టు పూర్తి చేయడానికి డబ్బులు కావాలని జోలె పట్టుకొని అడిగితే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చి ఉండేవారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడమన్నది ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తోంది. 2024 జూన్‌ కల్లా పూర్తి చేయాలని కేంద్ర జలవనరులశాఖ మంత్రి షెకావత్‌ చెబుతుంటే... 2025 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన ఒక నేత 2022 నాటికి పూర్తి చేస్తామని తొడ కొట్టి సవాల్‌ చేశారు. ప్రస్తుతం ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రికి నోటిపారుదలే తప్ప... నీటిపారుదల గురించి తెలియదు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోపై విమర్శలు చేయడానికి ఆయనకు సమయం ఉందే తప్ప... ప్రాజెక్టు పనుల ప్రగతిపై మాట్లాడడానికి మాత్రం లేదు. రివర్స్‌ టెండరింగ్‌ పేరిట పోలవరం పనులను ప్రభుత్వ పెద్దలు సర్వనాశనం చేశారు... ’ అని రఘురామ పేర్కొన్నారు.

దూసుకుపోతున్న తెలంగాణ: ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని రఘురామ చెప్పారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ ఆదాయంలో, అభివృద్ధిలో ముందంజలో ఉండగా... గత నాలుగేళ్లలో రాష్ట్రం వెనుకంజ వేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే నష్టపోతుందని భావించి గతంలో న్యాయస్థానంలో అభ్యంతరం వ్యక్తం చేశాను. అయితే... సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఆ రాష్ట్రం ప్రగతి పథంలో నడవడం అభినందనీయం..’’ అని రఘురామ పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని